నోట్ల రద్దు టు బంగారం, మోడీకి షాక్: పవన్ కళ్యాణ్తో పావులు, బాబు ఏం చేస్తారు?
నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై, బంగారం పరిమితుల పైన లెఫ్ట్ పార్టీ పోరాటానికి పవన్ మద్దతు పలికితే, ఇదే విషయం పైన అసంతృప్తితో ఉన్న చంద్రబాబు అప్పుడు ఏం చేస్తారనే చర్చ జరుగుతోంది.
అమరావతి: నోట్ల రద్దు మొదలు బంగారం పైన పరిమితుల వరకు బీజేపీ పైన తెలుగుదేశం, జనసేన పార్టీలు అసంతృప్తితో ఉన్నాయి. రూ.500, రూ.1000 నోట్ల రద్దును ఇరు పార్టీలు స్వాగతించాయి. అయితే, ప్రజల ఇబ్బందుల దృష్ట్యా బీజేపీని నిలదీస్తున్నాయి.
నోట్ల రద్దును ప్రకటించి ఇన్ని రోజులు అయినా ఇబ్బందులు కొనసాగడం సరికాదని ఇటీవలి వరకు చంద్రబాబు పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. నోట్ల రద్దును స్వాగతిస్తున్నప్పటికీ, ప్రజల ఇబ్బందుల దృష్ట్యా తాము ప్రశ్నిస్తున్నామని టిడిపి చెబుతోంది.
బంగారంపై కేంద్రంపై దృష్టి: ఇలా ఉంటే పన్ను లేదు, కానీ
నోట్ల రద్దు తదనంతర పరిణామాల పైన టిడిపి ఒకింత ఆగ్రహంతోనే ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రజల ఇబ్బందుల పైన అసహనంతో ఉన్నారు. కేంద్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు.
మరోవైపు, లెఫ్ట్ పార్టీలు నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. నోట్ల రద్దు వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని, కోట్లు ఉన్న వారు క్యూలో నిలబడటం లేదని, పైగా నోట్ల రద్దు వల్ల వారికే లబ్ధి అని మండిపడుతున్నారు.
తాజాగా, గురువారం నాడు పవన్ కళ్యాణ్ లెఫ్ట్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. నోట్ల రద్దు, తదనంతర పరిణామాల పైన వారు చర్చించారు. పవన్తో కలిసి వెళ్లాలని లెఫ్ట్ ఎప్పటి నుంచో ఉవ్వీళ్లూరుతోంది. అందుకు అనుగుణంగా నోట్ల రద్దు అంశంతో పావులు కదుపుతోందని. నోట్ల రద్దును ప్రశ్నిస్తున్న లెఫ్ట్, ప్రజల ఇబ్బందులపై అసహనం వ్యక్తం చేస్తున్న పవన్ కళ్యాణ్ కలవడం చర్చనీయాంశంగా మారింది.
నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్రం ముఖ్యమంత్రులు సహా 13 మందితో సబ్ కమిటీ వేసింది. దీనికి కన్వీనర్గా చంద్రబాబు ఉన్నారు. సబ్ కమిటీ వేసిన మరుసటి రోజు కేంద్రం బంగారం పైన పరిమితులు విధించింది. ఇది టిడిపికి ఆగ్రహం తెప్పిస్తోంది.
బంగారం పైన పరిమితులు విధించడం సరికాదని తెలుగుదేశం పార్టీ నేతలు ఎప్పటికి అప్పుడు హెచ్చరిస్తున్నారు. అలాగే, ఏపీ కేబినెట్ భేటీలోను మంత్రులు చంద్రబాబుకు ఓ సూచన చేశారు. బంగారంపై పరిమితులు సరికాదని చెప్పాలని అన్నారు. అలా చేస్తే ప్రజల ఆగ్రహం చవిచూడాల్సి ఉంటుందని బీజేపీకి చెప్పాలని చంద్రబాబుకు సూచించారు.
బంగారం పైన పరిమితుల నేపథ్యంలో చంద్రబాబు కన్వీనర్గా ఉండే బీజేపీతో పాటు మనకూ ఇబ్బందులేనని టిడిపి భావిస్తోంది. దీంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని అంటున్నారు.
నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై, బంగారం పరిమితుల పైన లెఫ్ట్ పార్టీ పోరాటానికి పవన్ మద్దతు పలికితే, ఇదే విషయం పైన అసంతృప్తితో ఉన్న చంద్రబాబు అప్పుడు ఏం చేస్తారనే చర్చ జరుగుతోంది. మొత్తానికి ఈ అంశాలు బీజేపీని, ముఖ్యంగా ఏపీలో కమలం పార్టీకి ఇబ్బందులు కొని తెచ్చేలా కనిపిస్తున్నాయని అంటున్నారు.