మోడీతో జగన్ ఫిక్సింగ్: గాలి, సీతమ్మ శీలం గురించి అంటూ అనురాధ
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ఏపీ రాజధాని ప్రాంత రైతులను జగన్ రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్కు రాజధాని అవసరం ఉందా? లేదా? అనేది జగన్ స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ ప్రధాని మోదీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో వైసీపీకి ఓట్లు వేసిన మూడు గ్రామాలకు జగన్ వెళ్లి భూములు ఇవ్వద్దని చెబుతారని ఆయన అన్నారు.
తొందరలో సీఎంను అవుతానని, మీ భూములు మీకు తిరిగి ఇచ్చేస్తానని చెబుతారని, మరి రాజధాని ఎక్కడ కడతారని ముద్దు కృష్ణమనాయుడు ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీకి రాజధాని కావాలని అంటూ భూ సమీకరణ జరగకుండా జగన్ ఏ విధంగా రాజధాని నిర్మిస్తారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైయస్సార్ కాంగ్రెసు నేతలు టిడిపి యువనేత లోకేష్పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని టిడిపి ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ భవన్లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. లోకేష్పై వ్యక్తిగత విమర్శలు చేసే స్థాయికి వైసిపి నేతలు దిగజారారని అన్నారు.
తెలుగుదేశం పార్టీ నేతలు ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలకు దిగలేదని, అయినా వైకాపా నేతలు మాత్రం ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అన్నారు. సీతమ్మ శీలం గురించి శూర్ఫణక మాట్లాడితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అంబటి రాంబాబు, జగన్లు లోకేష్ గురించి మాట్లాడటం అంతే హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
వ్యక్తిగత విమర్శలు చేసే పరిస్థితిని వైసిపి నేతలే కల్పిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధి జరుగుతుంటే దానిని పట్టించుకోకుండా మాట్లాడటం సబబుకాదని అన్నారు. ఇప్పటికైనా జగన్ ప్రజాసమస్యల గురించి మాట్లాడితే బావుంటుందని ఆమె అన్నారు.