మాట మార్చొద్దు: కెసిఆర్కు గాలి, కవితని అడ్డుకున్నారు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు శుక్రవారం మండిపడ్డారు. తెలంగాణలో ఉన్న సెటిలర్స్ అందరూ తెలంగాణ బిడ్డలే అని ఇంతకు ముందు చెబుతూ వచ్చిన కెసిఆర్... ఇప్పుడు మాట ఎందుకు మార్చుతున్నాడని ప్రశ్నించారు.
1956 కంటే ముందు నుంచి తెలంగాణలో ఉన్న వారికి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుందనడం సరికాదన్నారు. అవసరానికి ఒకమాట, అవసరం తీరాక మరోమాట అనడం సరైన పద్ధతి కాదని కేసీఆర్కు హితవు పలికారు.
ఓయులుగా తీర్చిదిద్దుతాం: జగదీశ్వర్ రెడ్డి
తెలంగాణలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నింటినీ ఉస్మానియా స్థాయిలో తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. నిజామాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. తెలంగాణలో వర్శిటీలు సమస్యల్లో ఉన్నాయన్నారు. సీలేరు ప్రాజెక్టు కోసమే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలుపుకున్నారని ఆరోపించారు.
కవితను అడ్డుకున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు
తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితను కాంట్రాక్ట్ లెక్చరర్లు అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని వారు ఆమెను కోరారు.