ఇందిరా, రాజీవ్ల వల్లే కాలేదు.. నీ వల్లేమవుతుంది?: జగన్పై విరుచుకుపడ్డ గాలి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇష్టారీతిన దోచుకున్న జగన్.. ఇప్పుడు టిడిపిని కూలుస్తానంటూ రంగుల కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు.
తెలుగుదేశం పార్టీని కూల్చడం దివంగత మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల వల్లే కాలేదని అన్న గాలి, అలాంటిది జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమవుతుందని ప్రశ్నించారు. దివంగత నేత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే.. ఏపి సిఎం చంద్రబాబునాయుడు దాన్ని శక్తిమంతం చేశారని అన్నారు. రంగుల కలలు మాని వాస్తవలోకం రావాలని జగన్మోహన్ రెడ్డికి గాలి ముద్దుకృష్ణమ సూచించారు.
బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం: కెఈ
కేంద్రం గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్లో రాష్ట్రానికి ఏ మాత్రం న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులకు కూడా నిధులను కేటాయించలేదని అన్నారు.
విభజన అనంతరం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నామని, అయినా కేంద్రం నుంచి ఆశించినంత నిధులు రావడం లేదని అన్నారు. రైల్వే బడ్జెట్ తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని కెఈ కృష్ణమూర్తి అన్నారు.
సీమకు నీరందిస్తాం: దేవినేని
రాష్ట్రంలో సాగు, తాగు నీరును అందించడమే ప్రభుత్వ లక్ష్యమని భారీనీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టులు, కాలువల పనులు పూర్తి అయ్యే వరకు ప్రజా ప్రతినిధులు పనులను పరిశీలిస్తుంటారని చెప్పారు. రాయలసీమకు సాగు, తాగు నీరు అందిస్తామని మంత్రి దేవినేని ఉమా హామీ ఇచ్చారు.