జగన్ రెచ్చగొడుతున్నారు, జైలు తప్పదు: విరుచుకుపడిన గాలి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరోసారి విరుచుకుపడ్డారు. ధర్నాలతో జగన్ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. రాజధానిని నిర్మించొద్దని జగన్ కోరుకుంటున్నారా అని గాలి ప్రశ్నించారు.
రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటే జగన్ చరిత్ర హీనులవుతారని ఆయన దుయ్యబట్టారు. త్వరలో జగన్కు జైలు తప్పదని ఆయన జోస్యం చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషిచేస్తున్నారని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ సాధించడమే తెలుగుదేశం పార్టీ (టిడిపి) లక్ష్యమని ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి చెప్పారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సహకారంతో జిల్లాకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ఆయన తెలిపారు. కర్నూలు జిల్లా టీడీపీ నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని అన్నారు.
కర్నూలు జిల్లాలో పార్టీ పట్టు కోల్పోవాలని కొందరు లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వారి కలలు కలలుగానే మిగిలిపోతాయని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా జిల్లాలో టీడీపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని శిల్పా చక్రపాణి రెడ్డి జోస్యం చెప్పారు.