'ఒలంపిక్' వివాదంపై నోరు విప్పిన గల్లా జయదేవ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించుకున్న గుంటూరు ఎంపీ, ప్రముఖ పారిశ్రామిక వేత్త గల్లా జయదేవ్ ఈ వివాదంపై పెదవి విప్పారు. తిరుపతి వేదికగా ఈ నెల 4న జరిగిన కార్యవర్గ ఎన్నికను ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు ఆదివారం గుంటూరులోని మౌర్య హోటల్లో జరిగిన సమావేశంలో కార్యవర్గాన్ని ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించారు. ఈ నెల 4న జరిగిన ఎన్నికల్లో తాను అధ్యక్షుడిగా, ఛైర్మన్గా కేఈ ప్రభాకర్, కార్యదర్శిగా పురుషోత్తం, కోశాధికారిగా పద్మనాభం ఎన్నికయ్యామని అన్నారు.
తిరుపతిలో తమను ఎన్నుకునేందుకు జరిగిన ఎన్నికలే నిజమైనవని ఆయన పేర్కొన్నారు. భారత ఒలింపిక్ సంఘం ప్రతినిధి సమక్షంలో ఆరోజు ఎన్నిక జరిగిందని, అందుకే తమదే నిజమైన కార్యవర్గమని ఆయన వాదించారు. అంతక ముందు ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడిగా గల్లా జయదేవ్ ఎన్నిక చెల్లుతుందని, ఆయన్నే కొనసాగించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
ఏపీ జిమ్నాస్టిక్స్ జనరల్ సెక్రటరీ రాజేష్కుమార్ పేరుతో దాఖలైన పిటిషన్ను కోర్టు కోర్టు కొట్టేసింది. నకిలీ పత్రాలతో పిటిషన్ వేసినవారిపై చర్యలు తీసుకోవాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే తన సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేశారని, కోర్టులో తాను ఎలాంటి పిటిషన్ను దాఖలు చేయలేదని రాజేష్కుమార్ చెప్పారు.
ఈమేరకు ఆయన కోర్టులో ఫిర్యాదు చేశారు. ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికపై దాఖలైన ఫిర్యాదుపై కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే.