జగన్ చెప్పినట్లు ఆట మొదలైంది.. కానీ, పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగినప్పుడే!
గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో మరింత ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టిడిపి వర్సెస్ వైసిపి, మధ్యలో జనసేన అధినేత సమస్యలపై స్పందించడం తరుచూ చూస్తోందే.
అమరావతి: గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో మరింత ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టిడిపి వర్సెస్ వైసిపి, మధ్యలో జనసేన అధినేత సమస్యలపై స్పందించడం తరుచూ చూస్తోందే. అయితే, కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి నుంచి బిటెక్ రవి గెలుపొందారు.
బాలకృష్ణకు 'వైస్రాయ్' తెలుసు: బాబుతో శత్రుత్వంపై పురంధేశ్వరి, లక్ష్మీపార్వతితో ఎన్టీఆర్ పెళ్లిపై..
ఆ తర్వాత టీచర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వైసిపి గెలుపొందింది. అప్పటి నుంచి ఏపీలో రాజకీయాలు ఇంకొంత ఆసక్తికరంగా మారాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. కడపలో దశాబ్దాల తర్వాత బీటెక్ రవి విజయం టిడిపిలో వేయి ఏనుగుల బలాన్ని ఇచ్చింది.
ఆట మొదలైందన్న జగన్
వచ్చే ఎన్నికల్లో పులివెందుల సీటు కూడా తమదేనని వారు జగన్కు సవాల్ విసిరారు. బీటెక్ రవి గెలుపులో తనవంతు పాత్ర పోషించిన మంత్రి గంటా శ్రీనివాస రావును వచ్చే ఎన్నికల్లో పులివెందులలో జగన్పై పోటీకి నిలబెడదామా అనే చమత్కారకు చర్చ కూడా టిడిపిలో సాగింది.
ఆ తర్వాత పట్టభద్రుల ఎన్నికల్లో టిడిపి చతికిల పడటంతో జగన్ కూడా అదే స్థాయిలో స్పందించారు. కడప ఎన్నికతో టిడిపి సవాల్ విసరగా, పట్టభద్రుల ఫలితాల తర్వాత జగన్ దూకుడు ప్రదర్శించారు. ఓ సమయంలో జగన్ మాట్లాడుతూ.. ఆట మొదలైందని వ్యాఖ్యానించారు.
పవన్ రంగంలోకి దిగినప్పుడే గేమ్ మొదలు
అయితే, ఆట మొదలైంది ఇప్పుడు కాదని, జనసేన అధినేత పవన్ ఎప్పుడో ప్రారంభించారని మరికొందరు అంటున్నారు. అంతకుముందు పవన్ అడపాదడపా సమస్యలపై స్పందించారు. కానీ ఎప్పుడైతే, 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారో అప్పుడే అసలు ఆట ప్రారంభమైందని చెబుతున్నారు.
2019లో పోటీ చేస్తానని పవన్ ప్రకటించిన నేపథ్యంలో టిడిపి ఆచితూచి స్పందిస్తోంది. ఆయనను దూరం చేసుకునేందుకు ఏమాత్రం సిద్ధంగా లేదు. అయితే, కచ్చితంగా ఆయన దూరమవుదామనుకుంటే మాత్రం ఆ దిశలోను సిద్ధంగా ఉంది. ఎదురు దాడి చేసేందుకు సన్నద్ధంగా ఉంది.
పవన్ వర్సెస్ జగన్
ఏపీలోని సమస్యలపై.. వైసిపి అధినేత జగన్ వర్సెస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్గా కనిపిస్తోంది. సమస్యలపై స్పందించేందుకు ఇరువురు పోటాపోటీగా ఉన్నారు. అయితే, జగన్.. చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తుంటే, పవన్ సాఫ్టుగా చెబుతున్నారు.
కేబినెట్ విస్తరణపై.. మౌనం వెనుక..!
ఏపీలో వివిధ సమస్యలపై స్పందిస్తున్న పవన్ కళ్యాణ్ కొన్ని అంశాలపై మాట్లాడక పోవడం కూడా చర్చకు దారి తీస్తోంది. ప్రత్యేక హోదా మొదలు పలు మేజర్ అంశాలపై స్పందించారు. కానీ వైసిపి నుంచి పోటీ చేసి గెలిచిన నలుగురికి చంద్రబాబు తన కేబినెట్లో చోటిచ్చారు.
ఈ రాజ్యాంగ ఉల్లంఘనపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదనే చర్చ సాగుతోంది. ఇదే అంశాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది.
అయితే, తెలంగాణలో అలా జరిగినప్పుడు గట్టిగా స్పందించకుండా, ఇప్పుడు స్పందిస్తే ఇబ్బంది అవుతుందనా లేక ప్రస్తుత రాజకీయాల్లో ఇలాంటివి సహజం అని మాట్లాడటం లేదా ఎవరికీ అంతు పట్టడం లేదు. కానీ వైసిపి దీనిపై పవన్ను నిలదీస్తోంది. బీజేపీ నేత పురంధేశ్వరి మాత్రం ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
ఆసక్తికరంగా మారిన రాజకీయం..
ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రాజకీయాలు మరింత ఆసక్తిగా మారింది మాత్రం నిజం. అంతకుముందు మాజీ సీఎస్ రమాకాంత్ సాక్షి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ జగన్కు ఇబ్బందిని తీసుకు వచ్చింది. దీనిని చూపించి సీబీఐ.. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరింది. దీనిపై మూడ్రోజుల క్రితం జగన్ కౌంటర్ దాఖలు చేశారు.
చంద్రబాబు తన కేబినెట్లోకి నలుగురు వైసిపి ఎమ్మెల్యేలను తీసుకున్నారు. దీనిపై జగన్ ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి సహా ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. దీనిపై చంద్రబాబు టిడిపి నేతలు తీవ్రంగా స్పందించారు. 11 ఛార్జీషీట్లలో నిందితుడిగా ఉన్న వ్యక్తి, అక్రమాస్తులు కేసులో ఉన్న వ్యక్తి నైతికత గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. సీఎం చంద్రబాబు కూడా జగన్ ఫిర్యాదుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండేళ్ల ముందే మమరింత వేడెక్కింది
మొత్తానికి, ఎన్నికలకు మరో రెండేళ్లు ఉండగానే ఏపీలో ఓ విధంగా రాజకీయాలు వేడెక్కాయని చెప్పవచ్చు. ఓ వైపు పవన్ కళ్యాణ్ తన సినిమాలను త్వరగా పూర్తి చేసుకొని జనసేన పార్టీ పటిష్టతపై దృష్టి సారించనున్నారు. ఇప్పటికే ఆయన పలు సమస్యలపై స్పందిస్తున్నారనే ముద్రను ప్రజల్లో వేసుకున్నారు.
ఇక, జగన్కు సీబీఐ, ఈడీ కేసులు అప్పుడే మరోసారి చుట్టుకుంటున్నాయి. ఆయన భవితవ్యంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోను ఆందోళన ఉన్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీతో పెట్టుకుంటే మాత్రం ఏమైనా జరగవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక చంద్రబాబు అసెంబ్లీలను 225 స్థానాలకు పెంపుదల చేసే ప్రయత్నంలో ఉన్నారు. వాటితో 2019లో విపక్షాలను దెబ్బకొట్టాలని చూస్తున్నారు. వైసిపి గట్టిగా ఉన్న చోట, అలాగే, జగన్ సామాజిక వర్గానికి కేబినెట్లో చోటిచ్చి, ఆయనను దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కాపులను కూడా దూరం చేసుకోకుండా పావులు కదుపుతున్నారు.