గిరిజన యువతులపై గ్యాంగ్ రేప్, రూ.50 వేలతో సెటిల్ మెంట్?
విశాఖపట్టణం ఏజెన్సీ ప్రాంతంలో దారుణం చోటుచేసుకొంది.ఇద్దరు గిరిజన యువతులపై గ్యాంగ్ రేప్ జరిగింది. అయితే ఈ ఘటనపై ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి.
విశాఖపట్టణం: విశాఖపట్టణం ఏజెన్సీ ప్రాంతంలో దారుణం చోటుచేసుకొంది.ఇద్దరు గిరిజన యువతులపై గ్యాంగ్ రేప్ జరిగింది. అయితే ఈ ఘటనపై ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి.
చింతపల్లి మండలం తాజంగి గ్రామంలో జాతరకు వచ్చిన ఇద్దరు ఆదీవాసీ యువతులపై ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
తాజంగిలో ఈ నెల 18 నుండి 20 వరకు పోతు, రాజుబాబుల జాతరను నిర్వహించారు. శనివారం నాడు జాతర చివరిరోజు కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా నర్సీపట్నం నుండి కూడ పెద్ద సంఖ్యలో ప్రజలు జాతరకు వచ్చారు.
అయితే శనివారం రాత్రి 11 గంటల సమయంలో వర్షం కురవడంతో జాతర సాంస్కృతిక కార్యక్రమాలకు కొంతసేపు అంతరాయమేర్పడింది. దీంతో జాతరకు వచ్చిన లంబసింగి సమీప గ్రామానికి చెందిన ఇద్దరు యువతులు సమీపంలోని పాఠశాల భవనంలో తలదాచుకొన్నారు.
ఇది గమనించిన స్థానిక ప్రజా ప్రతినిధి కొడుకు, హెడ్ కానిస్టేబుల్ కొడుకు,మరో ఐదుగురు యువకులు ఆ యువతులపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన యువతుల బంధువులపై దాడికి పాల్పడ్డారు.
వీరిచేతిలో దెబ్బలుతిన్న యువతుల బంధువులు కేకలు వేయడంతో గ్రామస్థులు అక్కడికి చేరుకొని ఏడుగురిని చితకబాదారు. వారినుండి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొన్నారు.
అయితే పట్టుబడిన నిందితుల్లో తమ కొడుకు ఉండడంతో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి రంగంలోకి దిగాడు. పెద్దలతో మాట్లాడి పంచాయితీ చేసుకొన్నాడు. బాధిత యువతును వాహనంలో వారి గ్రామాలకు పంపారు. పోలీసులకు ఫిర్యాదులు చేయకుండా, ఎటువంటి కేసులు లేకుండా ఇద్దరూ యువతులకు 50 వేల రూపాయాలను ముట్టజెప్పాలని పంచాయితీలో నిర్ణయించారు.అయితే ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు చెబుతున్నారు.