గంగుల ఎఫెక్ట్: గోస్పాడు ఏకపక్షమేనా, తమ్ముడిని కాదని, వైసీపీకి దెబ్బేనా?
:నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాప్రెడ్డి టిడిపిలో చేరడం ఉపఎన్నికల్లో టిడిపికి కలిసివచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
నంద్యాల:నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాప్రెడ్డి టిడిపిలో చేరడం ఉపఎన్నికల్లో టిడిపికి కలిసివచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గపరిధిలో బలమైన అనుచరవర్గం ఉన్న గంగుల ప్రతాప్రెడ్డి కీలకమైన సమయంలో టిడిపిలో చేరడం ఆ పార్టీకి కలిసివచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఈ నెల 23వ, తేదిన ఉపఎన్నిక జరగనుంది.ఈ సమయంలో ఈ నియోజకవర్గంలో గెలుపు ఓటములపై ప్రభావం చూపే అనుచరగణం ఉన్న గంగుల ప్రతాప్రెడ్డి టిడిపిలో చేరడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది.
చిరంజీవి బాటలోనే పవన్, ఆ భయంతోనే నంద్యాలలో తటస్థ వైఖరి!
గంగుల ప్రతాప్రెడ్డి టిడిపిలో చేరడం భూమా ఫ్యామిలీ సభ్యులు కొంత ఇబ్బంది పడుతున్నట్టు కన్పిస్తోంది. అయితే భూమా ఫ్యామిలీకి తమకు గతంలో వైరం ఉన్న విషయం వాస్తవమేనని గంగుల ప్రతాప్రెడ్డి ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఈ వైరం లేదని కూడ ఆయన ప్రకటించారు. అఖిలప్రియ అనుమానపడాల్సిన అవసరం కూడ లేదని ప్రతాప్రెడ్డి భరోసాను ఇచ్చే ప్రయత్నం చేశారు.
నంద్యాల బైపోల్: లోకేష్కు కీలక బాధ్యతలు, ఆ భయంతోనా?
ఈ రెండు కుటుంబాలకు నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో బలమైన వర్గం ఉంది. గంగుల ప్రతాప్రెడ్డి టిడిపిలో చేరడంతో భూమా ఫ్యామిలీకి ఈ ఎన్నికల్లో కలిసివచ్చే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గంగుల చేరికతో గోస్పాడు ఏకపక్షమేనా?
నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో గంగుల ప్రతాప్రెడ్డి ఊహించని విధంగా టీడీపీలోకి చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 2004 నుంచి 2009 వరకు ఆళ్ళగడ్డ ఎమ్మెల్యేగా గంగుల ప్రతాప్ రెడ్డి వ్యవహరించారు. అదే సమయంలో ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలం అప్పట్లో ఆళ్ళగడ్డ పరిధిలో ఉండేది. ఎమ్మె ల్యేగా గంగుల ప్రతాపరెడ్డి హయంలో గోస్పాడు అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిం చారు. గోస్పాడు మండలం నుంచి గంగుల ప్రతాపరెడ్డి తన ముఖ్య అనుచరులకు నామినేటెడ్ పదవులు ఇప్పించారు.దీనికితోడు గంగుల ప్రతాప్ రెడ్డికి నంద్యాల పట్టణంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సీఎం సమక్షంలో గంగుల ప్రతాప్రెడ్డి, ఆయన సోదరుడు సుదర్శన్రెడ్డి, కుమారులు ఫణి కృష్ణారెడ్డి, భరత్రెడ్డి, కాటన్ బోర్డు మాజీ మెంబర్ చింతకుంట్ల శ్రీనివాస రెడ్డి, సీనియర్ నేత సీపీ రామకృష్ణారెడ్డి టీడీపీలో చేరారు. వీరిలో భూమా కుటుంబానికి సీపీ రామ కృష్ణారెడ్డి, చింతకుంట్ల శ్రీనివాసరెడ్డి సమీప బంధువులు కావడం, ఉప ఎన్నికలో గోస్పాడు మండలంలో తమకు మరింత కలిసి వచ్చే అంశమని టీడీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.
Recommended Video
నంద్యాల పార్లమెంట్ పరిధిలో గంగులది కీలకపాత్ర
నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో భూమా, గంగుల కుటుంబాలకు వర్గాలున్నాయి. ఈ నియోజకవర్గ పరిధిలో ఈ రెండు కుటుంబాలకు ప్రత్యేకించి వర్గాలున్నాయి. తరాల నుండి ఈ వర్గాలు కొనసాగుతున్నాయి. దీంతో రాజకీయ ఆధిపత్యం కోసం ఈ రెండు కుటుంబాలు ఏదో ఒక పార్టీలో ఉన్నారు. గంగుల ప్రతాప్రెడ్డి సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తాజాగా టిడిపిలో చేరారు. 1991 లో నంద్యాల ఎంపీగా గంగుల ప్రతాపరెడ్డి దాదాపు 1.87 లక్షల భారీ మెజార్టీతో గెలుపొందారు. అంతకు ముందు 1980లో తన తండ్రి తిమ్మారెడ్డి మరణంతో జరిగిన ఉప ఎన్నికలో ప్రతాపరెడ్డి మొదటిసారిగా ఆళ్ళగడ్డ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1985 లో, 2004లో కూడా గంగుల ప్రతాపరెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఫ్యాక్షన్ రాజకీయాల పుట్టినిల్లుగా పేరుగాంచిన ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో భూమా, గంగుల కుటుంబాల మధ్యే అన్ని ఘర్షణలు నడిచాయి. 2014 ఎన్నికలకు ముందు ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితుల వల్ల గంగుల ప్రభాకర్రెడ్డి టీడీపీలో చేరారు. అప్పటికి వైసీపీ నేతలుగా భూమా నాగిరెడ్డి, భూమా శోభానాగిరెడ్డి ఉన్నారు. శోభానాగిరెడ్డి మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా ఎన్నికలో పోటీ చేయాలని గంగుల ప్రభాకర్రెడ్డి భావించినప్పటికీ అధినాయకత్వం గత సాంప్రదాయం ప్రకారం పోటీకి నిలపలేదు.
తమ్ముడు టిడిపిని వీడితే అన్న టిడిపిలో చేరాడు
2014 ఎన్నికల ముందు గంగుల ప్రతాప్రెడ్డి సోదరుడు గంగుల ప్రభాకర్రెడ్డి టిడిపిలో చేరారు. భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియ టిడిపిలో చేరడంతో గంగుల ప్రభాకర్రెడ్డి టిడిపిలో ఇమడలేకపోయారు. నాలుగు మాసాల క్రితం ప్రభాకర్రెడ్డి టిడిపిని వీడి వైసీపీలో చేరారు. ఆయన వైసీపీలో చేరిన వెంటనే వైసీపీ ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. మరోవైపు తన సోదరుడు ప్రతాప్రెడ్డితో కలిసి ప్రభాకర్రెడ్డి జగన్తో సమావేశమయ్యారు.కానీ, వైసీపీ నుండి సానుకూల సంకేతాలు రాలేదు.ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ గంగుల ప్రతాప్రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై తన అనుచర గణంతో సమావేశమవుతూ వచ్చారు. భూమా మరణానంతరం నంద్యాల ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ అభ్యర్థిగా గంగుల ప్రతాపరెడ్డిని పార్టీలో చేర్చుకొని అవకాశం ఇవ్వవచ్చని జోరుగా ప్రచారం జరిగింది. ఇందుకు జగన్తో ప్రతాపరెడ్డి భేటీ కావడం కూడా కారణం. అయితే టీడీపీకి గుడ్బై చెప్పిన శిల్పాను వైసీపీ తమ అభ్యర్థిగా నిలబ్టెడంతో గంగుల ప్రతాప్రెడ్డి వ్యవహారం మరుగున పడింది.దరిమిలా ప్రతాప్రెడ్డి టిడిపిలో చేరారు
ఉభయులకు ప్రయోజనమేనా?
నంద్యాల ఉపఎన్నికల్లో వైసీపీని చావుదెబ్బకొట్టేందుకు టిడిపి అన్ని రకాల ప్రయత్నాలను చేస్తోంది.ఈ సమయంలో గంగుల ప్రతాప్రెడ్డి రూపంలో టిడిపికి అవకాశం కలిసివచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గపరిధిలో టిడిపికి బలమైన నాయకుడు అవసరం ఉంది. అదే సమయంలో క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రతాప్రెడ్డికి టిడిపి మరోసారి అవకాశం కల్పించింది. అంతేకాదు తాజాగా జరిగే ఉపఎన్నికల్లో టిడిపికి గంగుల ప్రతాప్రెడ్డి చేరిక కలిసివచ్చే అవకాశం లేకపోలేదు. నంద్యాల ఎంపి ఎస్పీవై రెడ్డి టిడిపి అభ్యర్థి తరపున ఎక్కువ సమయం కేటాయించి ప్రచారం నిర్వహించకపోవడంతో టిడిపి గంగుల చేరికకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.