తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్కు గంటా ఫిర్యాదు, రిషికేశ్వరిపై నరసింహన్ ఆరా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు మంగళవారం నాడు గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఈ సందర్భంగా గంటా... ఏపీలో తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణాల్లో ప్రవేశాలు చేపట్టక పోవడం దారుణమన్నారు.
తొమ్మిదో షెడ్యూల్, పదో షెడ్యూల్తో పాటు, రిషికేశ్వరి మృతి విచారణ పైన గంటా గవర్నర్ నరసింహన్తో చర్చించారని తెలుస్తోంది.
ఈ విషయమై ఆయన గవర్నర్కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ సమక్షంలో జరిగిన నిర్ణయాలను తెలంగాణ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, అంబేడ్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయానికి సంబంధించిన అంశాలపై ఇప్పటికే రెండు రాష్ట్రాలు కోర్టుకు వెళ్లాయి.
రిషికేశ్వరి ఘటన పైన మాట్లాడుతూ... రిషికేశ్వరి ఉదంతాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని చెప్పారు. ఇక పైన ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు. అందుకోసం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎవరైనా ర్యాగింగ్కు పాల్పడితే వేటు తప్పదని హెచ్చరించారు. అలాంటి వారు శాశ్వతంగా చదువు కోకుండా నిషేధం ఉంటుందని చెప్పారు. వైస్ ఛాన్సలర్లతో గవర్నర్ త్వరలో భేటీ అవుతారని చెప్పారు. అంబేడ్కర్, ఫైన్ ఆర్ట్స్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఏపీకి జరిగిన అన్యాయంపై వివరించామని చెప్పారు. గుంటూరు జిల్లా నాగార్జున వర్సిటీలో రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
ర్యాగింగ్ ప్రోత్సహించే కళాశాలల గుర్తింపును రద్దు చేస్తామని చెప్పారు. రిషికేశ్వరి ఘటనలో బాధ్యుల పైన చర్యలు తీసుకుంటామన్నారు. రిషికేశ్వరి మృతి పైన ఈ నెల 10వ తేదీన నివేదిక సిద్ధం కానున్నట్లు గంటా చెప్పారు. దీనిపై ప్రాథమిక నివేదిక సిద్ధమైందన్నారు. కాగా, రిషికేశ్వరి మృతి పైన గవర్నర్ నరసింహన్ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది.
సాయంత్రం గవర్నర్నుకలవనున్న కెసిఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం నాడు సాయంత్రం గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు.