విద్యార్థులతో ఆటలొద్దు: 'నారాయణ'పై గంటాను ఇరుకున పెట్టిన అధికారి
గుంటూరు: విద్యా విధానంలోని లోపాలను సవరించి ర్యాగింగ్కు పాల్పడిన వారితి చదివే అవకాశం లేకుండా చట్టాన్ని తీసుకొస్తామని మంత్రి గంటా శ్రీనివాస రావు స్పష్టం చేశారు. గుంటూరు ఏసీ కాలేజీలో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు, అధికారులు, కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.
విద్యార్థుల వరుస ఆత్మహత్యలకు కారణాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారి విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఉపక్రమించింది. గంటా అధ్యక్షతన గుంటూరులో శనివారం ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా కార్యక్రమాల ద్వారా అభిప్రాయాల్ని సేకరించి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెడతామని గంటా చెప్పారు. రాష్ట్రంలో గత మూడేళ్లలో 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రైవేట్ యాజమాన్యాల కోసం పిల్లల భవిష్యత్తును ఫణంగా పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. ర్యాంకుల కోసం విద్యార్థులతో ఆడుకోవద్దని హితవు పలికారు. ఆదివారాల్లో, సెలవు దినాల్లో పరీక్షలు పెట్టకూడదని, సాయంత్రం 4 నుంచి 6గంటల వరకు విద్యార్థులకు తరగతులు నిర్వహించకూడదని కళాశాలలకు సూచించారు.
విద్యా వ్యవస్థలో ప్రభుత్వపరంగా కొన్ని లోపాలున్నట్టు గుర్తించామని, వాటిని సమూలంగా మారుస్తామన్నారు. విద్యా సంస్థల్లోనూ మరికొన్ని లోపాలు గుర్తించామన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల తరఫు నుంచీ లోపాలు తలెత్తుతున్నాయని, వాటన్నింటిని అధిగమించే విధంగా చట్టంలో మార్పులు తెస్తామన్నారు.
అధ్యాపకులపై ఒత్తిడిలేని విద్యాబోధన విధానం అమలు చేస్తామన్నారు. ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థులకు ప్రస్తుతం టిసి ఇవ్వటం, సస్పెండ్ చేయటం జరుగుతుందన్నారు. అయితే నూతన విద్యావిధానంలో ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థులను ఎక్కడా చదివే అవకాశం లేకుండా చట్టం తీసుకురానున్నట్టు మంత్రి గంటా తెలిపారు.
కాగా, సమీక్ష సమావేశం జరుగుతున్న సమయంలో హాస్టల్స్పై చర్చ ప్రారంభం కాగా కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి ఒకరులేచి ప్రైవేటు కళాశాలలైన నారాయణ 20, శ్రీ చైతన్య 30 హాస్టళ్లను చట్టవ్యతిరేకంగా నడుపుతున్నారన్నారు.
దీంతో మంత్రి గంటా అధికారిపై మండిపడుతూ... హాస్టళ్లపై చర్యలు తీసుకున్నారా? అని ప్రశ్నించారు. అధికారి నుంచి లేదని సమాధానం వచ్చింది. చర్యలు తీసుకోకుండా ఎందుకు ఉపేక్షించారంటూ మరలా ప్రశ్నించారు. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, వారికి నోటీసులు ఇచ్చామన్నారు.
అయినప్పటికీ హాస్టళ్లు కొనసాగుతున్నాయని చెప్పటంతో గంటా అసహనం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా విద్యాశాఖాధికారి మరొకరు మంత్రి గంటాతో మాట్లాడుతూ... అధ్యాపకులు కొందరు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లినప్పుడు మరొకరిని నియమించాలని కోరారు. ముఖ్యమంత్రి స్వగ్రామమైన నారావారిపల్లెలో అధ్యాపకుడు దీర్ఘకాలిక సెలవులో ఉన్నారన్నారు.