అయ్యన్న వల్లే పార్టీకి చెడ్డ పేరు: గంటా సంచలన ఆరోపణలు
విశాఖ టీడీపీ నేతల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. గంటా శ్రీనివాస రావు.. మరో మంత్రి అయ్యన్నపాత్రుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
విశాఖపట్నం: జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. భూ కుంభకోణం ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో మంత్రి గంటా శ్రీనివాస రావు.. మరో మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
అయ్యన్నపాత్రుడి వల్లే తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట మంటగలుస్తోందంటూ తీవ్ర ఆరోఫణలు చేశారు. గతంలోనూ అయ్యన్నపాత్రుడి వల్లే పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని చెప్పారు. భూకుంభకోణం ఆరోపణలపై సీఐడీ సమగ్ర విచారణ జరపాలన్నారు.
కాగా, ఇటీవల విశాఖ భూ కుంభకోణంలో సొంత పార్టీ నేతలున్నా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గంటా ఈ విధంగా విమర్శలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతం నుంచీ మంత్రులు గంటా, అయ్యన్నపాత్రుడు మధ్య విభేదాలున్నా విషయం తెలిసిందే.
కాగా, అయ్యన్నపై మంత్రి గంటా ముఖ్యమంత్రి చంద్రబాబుకి లేఖ రాశారు. ఆయన వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. విశాఖ భూకుంభకోణంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని అన్నారు. పార్టీకి నష్టం జరగకూడదనే తాను విచారణ కోరుతున్నానని తెలిపారు. ఎలాంటి దర్యాప్తునైనా ఆహ్వానిస్తానని గంటా చెప్పారు. కాగా, రెండ్రోజుల క్రితమే విశాఖ భూస్కాంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అంతేగాక, సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు.