అయ్యన్న ఇలాగేవుంటే..: గంటా హెచ్చరిక, బాబుకు వివరంగా చెప్పారు
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మంత్రి గంటా శ్రీనివాసరావు రాసిన లేఖలో మరో మంత్రి అయ్యన్నపాత్రుడిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతేగాక, ఆయన వల్ల పార్టీకి భారీ స్థాయిలో నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. ఆయన ఇలాగే కొనసాగితే పార్టీకి ఇబ్బందికర పరిస్థితి తప్పదని హెచ్చరించారు. మంత్రి గంటా రాసిన లేఖను పరిశీలిచినట్లయితే..
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి!
‘రాష్ట్ర విభజన తరువాత విశాఖపట్నం ఐటి రాజధానిగా, ఆర్థిక రాజధానిగా, స్మార్ట్సిటీగా తీర్చిదిద్దడంలో మీ కృషి అభినందనీయం. హుదూద్ తుపాను వచ్చినప్పుడు విశాఖపట్నం భవిష్యత్పై ఈ ప్రాంత ప్రజలు ఎంతో ఆందోళన చెందిన సందర్భంలో మీరు ఇక్కడే ఉండి అతి తక్కువ సమయంలోనే సాధారణ స్థితికి తీసుకువచ్చి విశాఖవాసుల ప్రశంసలను పొందడం ఎంతో సంతోషాన్నిచ్చింది. అదేవిధంగా సిఐఐ సదస్సులు, ఐఎఫ్ఆర్, నిరుపేదల భూములను రెగ్యులరైజ్ చేసేందుకు పట్టాల పంపిణీ పండుగ, మహానాడు నిర్వహించి విశాఖ ఖ్యాతిని పెంపొందించడంలో తమ కృషి అభినందనీయం' అని సీఎంకు రాసిన లేఖలో మంత్రి గంటా వివరించారు.
అయ్యన్నపాత్రుడు ఇలా చేస్తే..
‘ఇటువంటి సందర్భంలో మన విశాఖ జిల్లాకు చెందిన మంత్రివర్యులు అయ్యన్నపాత్రుడు, ఈ జిల్లాలో పెద్దఎత్తున భూ ఆక్రమణలు జరుగుతున్నాయని, దానికి మన పార్టీకి చెందిన నాయకులు కారకులని పత్రికా సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం రాష్టవ్య్రాప్తంగా సంచలనమైన సంఘటన. ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం వలన విశాఖ ప్రతిష్ఠ దిగజారడమే కాకుండా, దాని ప్రభావం మన పార్టీపై కూడా ఉంటుంది. గతంలో కూడా విశాఖ ఉత్సవ్, ల్యాండ్ పూలింగ్, చంద్రన్న సంక్రాంతి కానుకల విషయంపై ఇటువంటి నిరాధార ఆరోపణలు చేసి, మన ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు' అని అయ్యన్నపై ఫిర్యాదు చేశారు గంటా.
పురంధేశ్వరి, బొత్సలకు అవకాశం
‘ఇలాంటి సంఘటనల వలన ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ, పురంధ్రీశ్వరి, సిపిఐ, సిపిఎం పార్టీ నాయకులు మన పార్టీపై ప్రతి రోజు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చి ప్రజల్లో అపనమ్మకం కలిగిస్తున్నారు' అని గంటా మండిపడ్డారు.
మీ కృషి వృథా కావొద్దు..
‘నిరాధార ఆరోపణల వలన విశాఖ నగర ప్రతిష్ఠతోపాటు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠ దెబ్బతిని మీరు రాష్ట్రం కోసం నిరంతరం పడుతున్న శ్రమ వృథా అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై సిబిసిఐడి, సిబిఐతోగాని, సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ విచారణ జరిపి, నిజానిజాలు రాష్ట్ర ప్రజలకు తెలియచేయాల్సిందిగా వినయపూర్వకంగా కోరుచున్నాను. ఇట్లు.. మీ విశ్వసనీయ.. గంటా శ్రీనివాసరావు' అని చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
అయ్యన్న వల్లే పార్టీకి చెడ్డ పేరు: గంటా సంచలన ఆరోపణలు