విశాఖ కాలేజీల్లో డ్రగ్స్.. నాకు సమాచారం ఉంది, గంజాయి సాగు కూడా: గంటా
డ్రగ్స్ విషయమై ఆయా కాలేజీల యాజమాన్యాలను ఇప్పటికే హెచ్చరించామని గంటా తెలిపారు.
విశాఖపట్నం: ఓవైపు హైదరాబాద్ను డ్రగ్స్ రాకెట్ కుదిపేస్తుంటే.. మరోవైపు విశాఖలోను డ్రగ్స్ మూలాలు ఉన్నాయంటున్నారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు. విశాఖలోని పలు కాలేజీల్లో డ్రగ్స్ వాడుతున్నట్లుగా తనకు స్పష్టమైన సమాచారం ఉందని వ్యాఖ్యానించారు.
డ్రగ్స్ విషయమై ఆయా కాలేజీల యాజమాన్యాలను ఇప్పటికే హెచ్చరించామని గంటా తెలిపారు. విశాఖ ప్రాంతంలో గంజాయి సాగు జరుగుతోందని, అధికారులు దాన్ని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. పూర్తి స్థాయిలో నియంత్రించలేకపోతున్నారని అంటున్నారు.
ఇటీవలి సమావేశంలో గంజాయి నియంత్రణ గురించి సీఎం చంద్రబాబు ప్రస్తావించారని, అవసరమైతే డ్రోన్స్, హెలికాప్టర్ కూంబింగ్ లు నిర్వహించాలని ఆయన ఆదేశించినట్లుగా చెప్పారు. ఏదో చిన్న చిన్న కేసులు పెట్టి కేసులను క్లోజ్ చేసే పరిస్థితి ఉండవద్దని అన్నారు. గంజాయి సాగు వెనుక ఏ స్థాయి వ్యక్తులు ఉన్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. డ్రగ్స్ రాకెట్ విషయంలో హైదరాబాద్ లాగా విశాఖ మారకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు.