జగన్ హెల్త్ బులెటిన్ విడుదల: తిరుపతిలో హోమం, ఆసుపత్రిలో...
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి పైన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జిజిహెచ్) వైద్యులు మంగళవారం మధ్యాహ్నం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
జగన్ 24 గంటలు తమ పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు చెప్పారు. జగన్కు క్రమేణా ఫ్లూయిడ్స్ అందిస్తున్నామన్నారు. మధ్యాహ్నం జిజిహెచ్ సూపరింటెండెంట్ రాజునాయుడు హెల్త్ బులెటిన్ వివరాలు వెల్లడించారు.
జగన్ ఆరోగ్యం క్రమంగా కుదుట పడుతోందన్నారు. జగన్కు బిపి 130/80, యూరిక్ యాసిడ్ 13.2గా ఉందని తెలిపారు. పూర్తిస్థాయిలో కోలుకునేదాకా జగన్ ఆసుపత్రిలో ఉండాలని సూచించారు. జగన్కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
కాగా, జగన్ చేస్తున్న నిరవధిక దీక్షను మంగళవారం తెల్లవారు జామున పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. పోలీసులు ఉదయం 4 గంటలకు దీక్షాస్థిలికి చేరుకున్నారు. కాసేపు జగన్తో మాట్లాడిన తర్వాత ఉదయం 4.11 గంటలకు దీక్షను భగ్నం చేశారు.
పోలీసులు భారీ సంఖ్యలో రావడంతో అక్కడున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని జగన్ను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. జగన్కు బలవంతంగా వైద్యులు ఫ్లూయిడ్స్ ఎక్కించి దీక్షను భగ్నం చేశారు.
కాగా, జగన్ దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ ఏపీలో అన్ని జిల్లాల్లో వైసిపి నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. జిల్లా కేంద్రాల్లో, గ్రామాల్లో వారు ఆందోళనకు దిగారు. జగన్ దీక్షను భగ్నం చేయడం కాకుండా.. ప్రత్యేక హోదా పైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
తిరుపతిలో జగన్కు, ప్రత్యేక హోదాకు మద్దతుగా అభిమానులు హోమం చేశారు. చంద్రబాబు సర్కార్ కళ్లు తెరిపించాలని తాము హోమం చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు, జగన్ను సంప్రదించిన తర్వాత ప్రత్యేక హోదాపై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు.