పిల్లల తారుమారు, తల్లుల గొడవ: ఆడబిడ్డ మృతి
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో శిశువుల తారుమారు జరిగింది. అది విషాదంతమైంది. మగ శిశువు కోసం తగువుపడిన తల్లుల వివాదంలో ఆడశిశువు మృతి చెందింది. గండి అనిత, కామినేని అనిత అనే ఇద్దరు మహిళలు ఈనెల 10వ తేదీ మధ్యాహ్నం పది నిమిషాల తేడాతో ప్రసవించారు.
వీరిలో ఒకరికి మగశిశువు, ఒకరికి ఆడశిశువు పుట్టారు. అయితే ఎవరికి ఎవరు పుట్టారో చెప్పడంలో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల వివాదం తలెత్తింది. తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన జి.అనితకు మొదట అబ్బాయి పుట్టాడని చెప్పారు. అలాగే కె.అనిత అనే మహిళకు అమ్మాయి పుట్టిందని సిబ్బంది తెలిపారు.
అయితే, రెండు రోజుల తర్వాత జి.అనితకు పుట్టింది అమ్మాయి అని అబ్బాయి కాదని చెప్పారు. దీంతో జి.అనిత తన బంధువులతో కలిసి ఆస్పత్రి సూపరింటెండెంట్ వేణుగోపాల్కు ఫిర్యాదు చేశారు. మొదట అబ్బాయి పుట్టాడని చెప్పి తర్వాత అమ్మాయిని ఇచ్చారని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సూపరింటెండెంట్ శిశువుల మార్పుపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.
ఇరువురికి ఆస్పత్రి సిబ్బంది డీఎన్ పరీక్షలు నిర్వహించారు. డీఎన్ఏ పరీక్షలో గండి అనితకు ఆడశిశువు, కామినేని అనితకు మగపిల్లాడు పుట్టినట్లు నిర్ధారించారు. అయినప్పటికీ జి.అనిత కుటుంబసభ్యులు అందుకు అంగీకరించకుండా తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు.
మగశిశువు కోసం ఇరు వర్గాలు గొడవకు దిగాయి. ఇద్దరు తల్లుల గొడవలో ఆడశిశువును పట్టించుకోకపోవడంతో తీవ్ర అస్వస్థతతో ఉన్న శిశువు చనిపోయింది. అయినా తల్లుల మనసు కరగలేదు. ఇద్దరు తల్లులు ఆడశిశువు మృతదేహాన్ని తీసుకునేందుకు ముందుకు రాలేదు.
ఆ వివాదం ముదరడంతో మగశిశువుకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలంటూ జిల్లా కలెక్టర్ను, ఎస్పీని ఆశ్రయించారు. దీంతో ఆడశిశువు మృతదేహాన్ని ఆస్పత్రి సిబ్బంది మార్చురీకి తరలించారు.