ప్రేమికుల బైక్ రేసింగ్, యువతి మృతి: మసాజ్ సెంటర్లపై దాడి
హైదరాబాద్: మూడు ప్రేమ జంటలు నగరంలోని సంఘీ టెంపుల్ వెళుతూ సరదాగా బైక్ రేసిందగ్ చేశారు. అయితే వారి సరదా కాస్తా విషాదంగా ముగిసింది. అదుపుతప్పిన ఓ ప్రేమ జంట బైక్ పల్టీలు కొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు.
శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఆమె ప్రియుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన హయత్నగర్ మండలం సంఘీనగర్లో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
మసాజ్ సెంటర్లపై పోలీసులు దాడులు
గచ్చిబౌలిలోని మసాజ్ సెంటర్లు, స్పాలపై వెస్ట్జోన్ పోలీసులు శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 20మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఉప్పల్లోని ఐడీఏలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రూ. 42 వేల నగదును, 8 సెల్ఫోన్స్ను స్వాధీనం చేసుకున్నారు.
విద్యుత్ షాక్తో వ్యక్తి సజీవ దహనం
సికింద్రాబాద్లోని యశోదా ఆస్పత్రి సమీపంలోని ఓ ట్రాన్స్ఫార్మర్ వద్ద వ్యక్తి మూత్రం పోస్తుండగా ఒక్కసారిగా అతనికి విద్యుత్ తగలింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ హై ఓల్టేజితో రావడంతో అతడు మంటల్లో పూర్తిగా కాలిపోయాడు.
అతనికి సంబంధించిన ఎలాంటి వివరాలు కూడా లభించకుండాపోయాయి. గతంలోనూ ఈ ప్రాతంలో ఇదే తరహాలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మంటలు ఎగసిపడటానికి గల కారణం షార్ట్ సర్క్యూట్ లేక మరేదైనా కారణమా అని తెలియాల్సి ఉంది.