బాలికపై ముగ్గురు గ్యాంగ్ రేప్: శీలానికి వెలకట్టిన పెద్దలు
వరంగల్: ఓ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా డోర్నకల్ మండలంలో జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణంపై పెద్దమనుషులు పంచాయతీ నిర్వహించి శీలానికి వెలకట్టారు. మీడియాలో వచ్చిన వార్తాకథనాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి - డోర్నకల్ మండలం వెన్నారం శివారులోని ఓ తండాకు చెందిన బాలిక (14)ను అదే తండాకు చెందిన యువకుడు లోబర్చుకున్నాడు.
ఈ క్రమంలో ఆ బాలిక రెండుసార్లు గర్భవతి కాగా, ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రహస్యంగా కుటుంబ సభ్యులు అబార్షన్ చేయించారు. కాగా, వారం రోజులక్రితం మేకలు కాస్తుండగా ఆ బాలికపై ఆ యువకుడితోపాటు అతని స్నేహితులైన మరో ఇద్దరు యువకులు కలిసి ఆత్యాచారం చేశారు. బాలిక కుటుంబ సభ్యులకు తెలపడంతో తండాలో పంచాయతీ నిర్వహించి రూ.1.30 లక్షలు పరిహారం కింద చెల్లించాలని ఇరువురు పెద్ద మనుషులు తీర్మానించారు.
పంచాయతీలో జరిగిన ఒప్పందం ప్రకారం అనుకున్న సమయానికి డబ్బులు చెల్లించకపోవడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా బాలిక తల్లిదండ్రులను పెద్దమనుషులు అడ్డుకుంటున్నట్లు తెలిసింది.
ఇదిలావుంటే, ఆర్థిక ఇబ్బందులు తాళలేక నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం దర్యాపూర్కు చెందిన షేక్ చాంద్(58), డాంగే గంగామణి(55) శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గత 35సంవత్సరాలుగా షేక్చాంద్, డాంగే గంగామణిలు సహజీవనం సాగిస్తున్నారు.
షేక్.చాంద్ బీడీ ప్యాకర్గా పని చేస్తుండగా, గంగామణి బీడీలు చుడుతూ జీవనం సాగించేది. వీరు ఇటీవల అనారోగ్యం పాలు కావడంతో కుటుంబ పోషణ కష్టంగా మారటంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నారు.