తల్లితో వివాహేతర సంబంధం: చిన్నారిని బెల్టుతో కొట్టాడు, సిగరెట్తో కాల్చాడు
అనంతపురం: సహజీవనానికి అడ్డు వస్తోందని ఐదేళ్ల చిన్నారిని ఓ మాజీ సైనికోద్యోగి చిత్రహింసలకు గురిచేశాడు. ఇది గమనించిన స్థానికులు చిన్నారిని తీసుకుని పోలీసులకు అప్పగించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఈ అమానుషమైన సంఘటన శుక్రవారం చూసింది.
రాయదుర్గానికి చెందిన రాధ(34) భర్త వదిలేయడంతో ఏడాది క్రితం మరిదితో కలిసి హిందూపురం చేరుకుంది. ఈమెకు ఐదేళ్ల కూతురు తారుణ్య ఉంది. మున్సిపల్ పరిధిలోని సడ్లపల్లిలో ఓ ఇంట్లో అద్దెకుంటూ తూమకుంట చెక్పోస్టులోని ఓ గార్మెంట్ పరిశ్రమలో పనిచేస్తోంది. కొద్ది రోజుల తరువాత మరిది కూడా వదిలేయడంతో స్థానికంగా ఉంటున్న విశ్రాంత మిలిటరీ ఉద్యోగి తిప్పేస్వామితో కలిసి ఉంటోంది.
రాధతో సహజీవనానికి ఆమె కుమార్తె అడ్డు వస్తోందని భావించిన తిప్పేస్వామి గత కొద్దిరోజులుగా తారుణ్య(5)ను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. శుక్రవారం రాధ పనికి వెళ్లగానే తిప్పేస్వామి చిన్నారిని బెల్టుతో వీపుపై వాతలు వచ్చేలా కొట్టాడు. సిగరెట్తో కాల్చాడు. ఆ హింసను తాళలేక చిన్నారి కన్నీరుమున్నీరవడంతో చలించిపోయిన చుట్టుపక్కల వారు బాలికను తీసుకుని టూ టౌన్ పోలీసుస్టేషన్కు చేరుకుని ఫిర్యాదుచేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు బాలిక తల్లి రాధను పిలిపించి విచారించారు. అయితే తిప్పేస్వామి ఉద్ధేశ పూర్వకంగా పాపను కొట్టలేదని, అంగన్వాడీ కేంద్రానికి సక్రమంగా వెళ్లనందునే చేయి చేసుకున్నాడని పేర్కొంది. టూ టౌన్ సిఐ మధుభూషణ్ ఆధ్వర్యంలో పోలీసు తిప్పేస్వామిపై కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.