జగన్ నీ ఆస్తులు రాష్ట్రానికిచ్చి మాట్లాడు, బాబు దేవుడు: ఊగిపోయిన రావెల, 'తెలంగాణలో ఉన్నావా'
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తాను అడ్డగోలుగా సంపాదించిన డబ్బులను రాష్ట్రానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడా లేడా చెప్పాలని మంత్రి రావెల కిషోర్ మంగళవారం అన్నారు. జగన్ పదేపదే ఓటుకు నోటు అంశాన్ని తీసుకు రాగా రావెల ఊగిపోయారు.
లక్ష కోట్లు తిన్న రాబందు హోదా గురించి మాట్లాడటమా అని రావెల మండిపడ్డారు. నీవు అడ్డగోలుగా సంపాదించిన దానిని రాష్ట్రానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నావా లేదా చెప్పు అని నిలదీశారు. ఆ తర్వాత హోదా గురించి మాట్లాడు అన్నారు.
చంద్రబాబు నవ్యాంధ్రను నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు నిత్యం కృషి చేస్తున్నారన్నారు. కానీ జగన్ రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నారన్నారు. వైయస్ కొడుకు, వైసిపి అధ్యక్షుడు జగన్ రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నారన్నారు.
జగన్ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆరోపించారు. ప్రజలు ఛీకొట్టి, తిరస్కరించినా ఇంకా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమకు దైవం లాంటి చంద్రబాబు పైన ఒక్క మాట మాట్లాడేందుకు కూడా వీల్లేదనారు. చంద్రబాబు అభివృద్ధి నిరోధక శక్తులు అన్నారు.
జగన్ వయసుకు మించి మాట్లాడుతున్నారు: దూళిపాళ్ల
జగన్ వయసుకు మించి మాట్లాడుతున్నారని దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ప్రత్యేక హోదా ప్రధాని మోడీ దయ మీద ఆధారపడి ఉందని జగనే చెప్పారని గుర్తు చేశారు. ఏపీని అభివృద్ధి చేసేందుకు అహర్నిషలు పని చేస్తున్న చంద్రబాబును పట్టుకొని ఔట్ డేటెడ్ పొలిటీషయన్ అనడం విడ్డూరమన్నారు.
జగన్ ఏపీలో ఉన్నారా లేక తెలంగాణలో ఉన్నారా చెప్పాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే జగన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఏపీ ఆత్మగౌరవాన్ని టిఆర్ఎస్ వద్ద తాకట్టు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణలోని మీ ఎమ్మెల్యేలచే టిఆర్ఎస్కు మద్దతు ఎందుకు ఇప్పించారన్నారు.
కేంద్రంతో కలిసి ఉంటేనే రాష్ట్రానికి నిధులు వస్తాయన్నారు. ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉంటే తెలంగాణ కోసం పని చేస్తున్నారా చెప్పాలని నిలదీశారు. మోడీని ఒప్పించి రాష్ట్రానికి ప్యాకేజీ తీసుకు రావాలని చంద్రబాబు చూస్తన్నారన్నారు.