స్నేహితులే బురద జల్లుతున్నారు, బయటపెడ్తా: సివిల్స్ 3వ ర్యాంకర్ గోపాలకృష్ణ
సివిల్స్ 3వ ర్యాంక్ గోపాలకృష్ణపై స్నేహితులే బురద జల్లుతున్నారా అంటే అవుననే అంటున్నారు ఆయన. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు జారీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.
అమరావతి: సివిల్స్ 3వ ర్యాంక్ గోపాలకృష్ణపై స్నేహితులే బురద జల్లుతున్నారా అంటే అవుననే అంటున్నారు ఆయన. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు జారీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.
తన స్నేహితులే తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నానని, ఇది కొత్త పరీక్ష అనుకుంటానని చెప్పారు. తాను పదేళ్లు కష్టపడ్డానని, దానిని వృథా కానివ్వనని చెప్పారు. అన్ని విషయాలను తాను త్వరలో బయటపెడతానని చెప్పారు.
సివిల్స్ 3వ ర్యాంకర్కు షాక్: గోపాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
కాగా, సివిల్ సర్వీసెస్ -2016లో మూడో ర్యాంక్ సాధించిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోణంకి గోపాలకృష్ణకు హైకోర్టు మంగళవారం నాడు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఆయన తప్పుడు ధృవీకరణ పత్రం సమర్పించి రిజర్వేషన్ పొందాడని, దీనిపై విచారణ జరపాలని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
యూపీఎస్ సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ -2016 లో గోపాలకృష్ణకు సివిల్స్లో మూడో ర్యాంకు వచ్చింది. అయితే అతడికి ఈ ర్యాంకు కేటాయించడం చట్టవిరుద్దంగా ప్రకటించి, అతను సమర్పించిన అంగవైకల్య ధృవీకరణ పత్రాన్ని విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లికి చెందిన న్యాయవాది ఎం మురళీకృష్ణ పిల్ దాఖలు చేశారు.
ఇందులో కేంద్ర వ్యక్తిగత శిక్షణశాఖ కార్యదర్శి, యూపీఎస్ సీ జాయింట్ సెక్రటరీ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, రోణంకి గోపాలకృష్ణను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఈ వ్యాజ్యంపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిగింది. నోటీసులు జారీ చేసిన అనంతరం కేసును మూడు వారాల పాటు వాయిదా వేసారు.