హైదరాబాద్: రియో ఒలింపిక్స్లో వెండి పతకం సాధించిన పివి సింధు గురువుగా గోపిచంద్ సత్కారాలు, ప్రశంసలు అందుకుంటున్నారు. బ్యాడ్మింటన్ క్రీడలో భారతదేశానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టిన వ్యక్తిగా కూడా ఆయన గుర్తుండిపోతారు. కానీ గోపిచంద్ మాత్రం ఓ విమర్శను ఎదుర్కోక తప్పడంలేదు.
గురువును మరిచిన గోపిచంద్ అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఆన్లైన్ పత్రికలు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ వార్తాకథనాలు రాస్తున్నాయి. ఒలింపిక్స్లో పతకం సాధించిన మల్లీశ్వరిని ఆయన గుర్తు చేసుకున్నారు. మల్లీశ్వరికి సత్కారం జరిగినప్పుడు తాను కింద ఉండి చూశానని, తాను కూడా అలాంటి సత్కారం పొందాలనే ఆకాంక్ష ఉండేదని గోపిచంద్ చెప్పుకున్నారు. మల్లీశ్వరిని గుర్తు చేసుకున్నప్పుడైనా గోపిచంద్ తన గురువును స్మరించుకోవాల్సి ఉండిందనే మాట వినిపిస్తోంది.
గోపిచంద్ గురువు పాలంకి ఉదయ భాస్కర్ బాబు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ కోచ్గా పనిచేశారు. చేతన్ ఆనంద్ వంటి అంతర్జాతీయ క్రీడాకారులు కూడా ఆయన వద్దనే శిక్షణ తీసుకున్నారని చెబుతారు. బ్యాడ్మింటన్కు గుర్తింపు లేనిరోజుల్లో దానిపై ఆసక్తిని కలిగించి, ఎంతో మందిని క్రీడాకారులుగా ఆయన తీర్చిదిద్దారు. గోపిచంద్ కూడా ఆయన వద్దనే శిక్షణ పొందారు.
ఆ తర్వాత గోపిచంద్ ఆరిఫ్, ప్రకాష్ పడుకొనేల వద్ద శిక్షణ పొందారని చెబుతారు. ఆ తర్వాతనే గోపిచంద్ ఆల్ ఇంగ్లాండు బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సాధించారు. దాని తర్వాత గోపీచంద్ అకాడమీని స్థాపించారు. అయితే, ఎక్కడ కూడా గోపీచంద్ తన గురువుల స్మరించుకోలేదనే విమర్శలు మాత్రం వస్తున్నాయి.