అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ల్యాండ్ ఇస్తే అక్కడ అకాడమీని పెడతానని బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పీవీ సింధు పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించిందని అన్నారు. సింధు దేశానికి కీర్తితెచ్చిందని పేర్కొన్నారు.
రియో ఒలింపిక్స్లో భారత్కు రజత పతకం సాధించడం ద్వారా క్రీడల్లో మహిళలు అద్భుతాలు చేయొచ్చని సింధు నిరూపించిందని చెప్పారు. అమ్మాయిలను కాపాడాలని అంటున్నారని, కానీ ఇప్పుడు అమ్మాయిలే మనకు పతకాలను తెచ్చిపెడుతున్నారని సింధునుద్దేశించి అన్నారు.
దేశం మొత్తాన్ని క్రీడల్లో మహిళా ప్రాతినిధ్యం పెంచేందుకు ప్రోత్సహించేలా సింధు ఆడిందని అన్నారు. ఆమెను దేశం మొత్తం అభినందిస్తోందని, పతకం సాధించిన అనంతరం తమకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూస్తుంటే మరింత ఉత్సాహం కలుగుతోందని అన్నారు.
మరింత మంది క్రీడాకారులు తయారయ్యే పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయని, ఇంతకంటే ఇంకేం కావాలని గోపీచంద్ అన్నారు.
గోపీచంద్ లాంటి కోచ్ దొరకడం అదృష్టం: పీసీ సింధు
పట్టు పరికిణీలో పీవీ సింధు అచ్చతెలుగు ఆడపిల్లాగా విజయవాడలో సందడి చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉంటే అందకూ పైకి వస్తారని సింధు పేర్కొంది. నా కోసం ఇంత మంది అభిమానులు వస్తారని అనుకోలేదని చెప్పింది.
గోపీచంద్ లాంటి కోచ్ దొరకడం తన అదృష్టమని, చాలా రోజుల తర్వాత విజయవాడకు రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. రియో ఒలింపిక్స్లో తనను దేవుడు దీవించాడని, ఇలాగే మరింత కాలం మంచి ప్రదర్శన ఇస్తానని విశ్వాసం వ్యక్తం చేసింది.
ఒలింపిక్స్లో పతకం సాధించాలన్న కల నెరవేరిందని సింధు తెలిపింది. ఇందుకోసం చాలా కష్టపడ్డానని, ఆ కష్టం రజత పతకం రూపంలో ఫలించిందని తెలిపింది. తన వెన్నంటి నిలిచిన కుటుంబ సభ్యులు, కోచ్ గోపీచంద్కు ధన్యవాదాలు తెలిపింది. వారు లేకుంటే ఈ రోజు తానిలా ఉండేదానిని కాదని స్పష్టం చేసింది.