ఇప్పుడే కావాలి: జగన్కు గోరంట్ల ఝలక్, 'వైసిపి అధినేతకు ఇంకా అర్థం కాలేదు'
అమరావతి: వచ్చే సమావేశాలలోగా ప్రత్యేక హోదా పైన కేంద్రం ప్రకటన చేయకుంటే తమ పార్టీ ఎంపీలచే రాజీనామా చేయిస్తానని చెప్పిన వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి బుధవారం నాడు సవాల్ చేశారు.
జగన్ ప్రత్యేక హోదా పేరుతో డ్రామాలాడుతున్నారని గోరంట్ల మండిపడ్డారు. వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్న జగన్ ఇప్పడే తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించి ఢిల్లీలో ఉద్యమించాలని హితవు పలికారు.
జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్ర ప్రజలు ఆయనను విశ్వసించరని చెప్పారు. ప్రత్యేక హోదాపైన రాష్ట్ర ప్రజలు సంపూర్ణ అవగాహనతో ఉన్నారని ఆయన తెలిపారు. కాగా, ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఆత్మరక్షణ: జగన్ తాజా అస్త్రం, పవన్ కళ్యాణ్ను కార్నర్ చేసేందుకేనా?
కాగా, జగన్ యువభేరిపై మంత్రులు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబులు మంగళవారం విరుచుకుపడ్డారు. ఆయన సభలకు తల్లిదండ్రులు తమ పిల్లలను పంపొద్దని అచ్చెన్నాయుడు కర్నూలులో కోరారు. రూ.44 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు 12 కేసుల్లో సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటున్న జగన్ సభలకు వెళితే యువకులు చెడిపోతారన్నారు.
రాష్ట్రానికి హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉద్యోగాలు వస్తాయని చెబుతున్న జగన్, గత రెండున్నరేళ్లుగా రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు. రాజధాని నిర్మాణం, పరిశ్రమలు, రాష్ట్రానికి వస్తున్న పోర్టులను అడ్డుకుంటూ అభివృద్ధి నిరోధకుడిగా మారారన్నారు.
ఈ విషయాలపై యువభేరిలో యువకులు జగన్ను నిలదీయాలని మంత్రి సూచించారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్వాగతించారో ప్రజలకు అర్థమైందని, జగన్కు మాత్రం అర్థం కాలేదని మరో మంత్రి పత్తిపాటి పుల్లారావు విజయవాడలో అన్నారు.
జగన్కు ఖాళీ దొరికినప్పుడల్లా ఏదో కార్యక్రమం చేస్తారని, ఇప్పుడు హోదా గురించి మాట్లాడుతున్నారన్నారు. ప్యాకేజీకి మించిన ప్రయోజనాలు హోదాతో ఏమి వస్తాయే చెబితే పోరాడుతానని చంద్రబాబు స్వయంగా చెప్పారన్నారు.
ప్రత్యేక హోదాపై తమ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయన పార్టీకి డిపాజిట్లు కూడా రావన్నారు. రాష్ట్రంలో వైసీపీ త్వరలో కనుమరుగు కావడం కాయమని మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు దోపిడీదారులుగా, స్మగ్లర్లుగా తయారయ్యారని మండిపడ్డారు. రూ.లక్ష కోట్లు దిగమింగి నీతులు చెబుతున్న జగన్ అరాచక శక్తిగా మారారన్నారు.