'గౌతమిపుత్ర శాతకర్ణి' థియేటర్ సీజ్: టీడీపీ అంతర్గత కుమ్ములాటలే కారణమా?
బాలకృష్ణ సినిమా వస్తుందంటే టీడీపీలో పండుగ వాతావరణమే. సింహా లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చినప్పుడు.. రోజుల తరబడి థియేటర్స్ ను లీజుకు తీసుకుని మరీ ఆ సినిమాను టీడీపీ నేతలు వీక్షించిన దాఖలాలున్నాయి.
ఏలూరు: బాలకృష్ణ సినిమా వస్తుందంటే టీడీపీలో పండుగ వాతావరణమే. సింహా లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చినప్పుడు.. రోజుల తరబడి థియేటర్స్ ను లీజుకు తీసుకుని మరీ ఆ సినిమాను టీడీపీ నేతలు వీక్షించిన దాఖలాలున్నాయి.
ఇక నందమూరి నటసింహం తాజా చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణితో అటు అభిమానులతో పాటు ఇటు టీడీపీ నేతల్లోను సందడి వాతావరణం నెలకొంది. అన్నిచోట్లా ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శిస్తున్నప్పటికీ.. ఏలూరులో మాత్రం స్థానిక రాజకీయ పోరు గౌతమిపుత్రకు బ్రేక్ వేసిందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
థియేటర్ సీజ్:
అధికారులు తమ పని తాము చేసుకుపోయారో.. లేక నిజంగానే తెర వెనుక ఏదైన మంత్రం పనిచేసిందో తెలియదు గానీ మొత్తానికి గౌతమిపుత్ర శాతకర్ణి ప్రదర్శింపబడుతున్న ఒక థియేటర్ ను అధికారులు సీజ్ చేశారు.
కామవరపుకోట మండలం తడికలపూడిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ థియేటర్ ప్రభుత్వ విప్ ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభమైంది. తొలిరోజు చిరంజీవి నటించిన ఖైదీ150 సినిమాను ప్రదర్శించగా.. మరుసటిరోజు బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణిని ప్రదర్శించారు.
అయితే గౌతమిపుత్ర శాతకర్ణి ప్రదర్శన కేవలం మొదటి ఆటకే పరిమితమైంది. నిబంధనలు సరిగా లేవన్న కారణంగా అధికారులు థియేటర్ ను సీజ్ చేశారు.
పీతల సుజాతపై ఆరోపణలు:
అధికారులు థియేటర్ సీజ్ చేయడం వెనుక మంత్రి పీతల సుజాత హస్తం ఉందనేది స్థానిక నేతల ఆరోపణ. మంత్రిగా ఉన్న తనను పక్కనబెట్టి.. ప్రభుత్వ విప్ తో థియేటర్ ప్రారంభోత్సవం చేయడం సుజాతకు గిట్టలేదని వారు చెబుతున్నారు.
పైగా.. ప్రభుత్వ విప్ ప్రభాకర్ థియేటర్ ను ప్రారంభించిన సమయంలో పీతల సుజాత కూడా అదే రోడ్డు గుండా వెళ్లారట. తనను పట్టించుకోకుండా 'విప్'కు ప్రాధాన్యతనివ్వడం నచ్చకనే.. అధికారుల చేత పీతల సుజాత థియేటర్ ను మూయించేశారని చెప్పుకుంటున్నారు.
అధికారుల మాట మరోలా:
సరైన సౌకర్యాలు, అనుమతులు లేనందువల్లే థియేటర్ ను సీజ్ చేశామని స్థానిక తహశీల్దారు నరసింహరాజు ప్రకటించారు. తహశీల్దారు అలా ప్రకటించినప్పటికీ.. స్థానిక టీడీపీ నేతలు మాత్రం పీతల సుజాత వైపే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే పీతల సుజాత థియేటర్ ను సీజ్ చేయించారని స్థానికంగా విస్తృతంగా ప్రచారం జరిగింది.
అయ్యన్నపాత్రుడు జోక్యం:
మంత్రి పీతల సుజాత, ప్రభుత్వ విప్ ప్రభాకర్ మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు మంత్రి అయ్యన్నపాత్రుడు రంగంలోకి దిగినట్టు సమాచారం. వివాదాన్ని ఇంతటితో ముగించాలని ఆయన ఇరువురిని కోరినట్టు తెలుస్తోంది.
తనపై ఆరోపణల నేపథ్యంలో పీతల సుజాత స్పందించారు. థియేటర్ ను సీజ్ చేయమని తానెవరిని ఆదేశించలేదని చెప్పారు. విప్ ప్రభాకర్ తో తనకు ఎలాంటి గొడవలు లేవని కూడా స్పష్టం చేశారు.