'కలాం పేరుతో నోబెల్ తరహా అవార్డు', విశాఖలోనే ఆగస్టు 15 వేడుకలు
హైదరాబాద్: ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు తొలిసారి విశాఖపట్నం ఆతిథ్యమివ్వనుంది. విశాఖలోని బీచ్ రోడ్డులో ఉన్న ఏయూ గ్రౌండ్స్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి.
ఈ మేరకు బుధవారం ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో విశాఖ కలెక్టర్ యువరాజ్, ఇతర అధికారులతో ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సమీక్ష నిర్వహించారు.
కలాం పేరుతో నోబెల్ తరహా అవార్డు: మోడీకి కంభంపాటి లేఖ
దివంగత మాజీ రాష్ట్రపతి, 'మిస్సైల్ మ్యాన్'గా పేరుగాంచిన అబ్దుల్ కలాం పేరుమీద నోబెల్ బహుమతి తరహాలో ఓ అవార్డును ప్రకటించాలని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ప్రతి ఏటా అక్టోబర్ 15 లేదా జులై 27న ఈ అవార్డును అందించేలా పరిశీలించాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
హుదుద్ బాధితులకు 10వేల ఇళ్లు: ఏపీ ప్రభుత్వం
ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గతేడాది సంభవించిన హుదుద్ తుపానులో ఇళ్లు కోల్పోయిన వారికి ఏపీ ప్రభుత్వం 10వేల ఇళ్లు మంజూరు చేసింది. ఎన్టీఆర్ ప్రత్యేక గృహ నిర్మాణ పథకం కింద ఈ ఇళ్లు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది.
ఇందుకు గాను ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తుపాన్ బాధిత జిల్లాల్లో జీ ప్లస్ మోడల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టబోతున్నట్టు తెలిపింది. తుపాను బాధితులకోసం ప్రభుత్వానికి దాతలు ఇచ్చిన విరాళాలతో కలిపి ప్రభుత్వ భాగస్వామ్యంతో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్టు పేర్కొంది.