పవన్ కళ్యాణ్ చెప్తే ఓకేనా: కొడాలి నాని, బాబు పనికిమాలిన వెధవ: వంగవీటి రాధా
విజయవాడ: బలవంతపు భూసేకరణ వద్దని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెబితే మంచి సూచన, తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ చెబితే రాజకీయమా అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని బుధవారం ప్రశ్నించారు. విజయవాడ సిఆర్డీఏ కార్యాలయం వద్ద జగన్ దీక్షా ప్రాంగణంలో ఆయన మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ వచ్చి కూడా చెప్పారని, బలవంతపు భూసేకరణ వద్దని చెప్పారన్నారు. పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమని, ఆయన చెప్పిన సూచన పాటిస్తామని టిడిపి నేతలు చెబుతున్నారని, అదే విషయం జగన్ చెబితే రాజకీయం అంటున్నారన్నారు.
ఈ రాష్ట్రంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా పని చేస్తున్న పార్టీ వైసిపి అన్నారు. బలవంతపు భూసేకరణ చేస్తే రైతులు భయపడవద్దని, తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఫుట్బాల్ ఆడినట్లు చంద్రబాబును ఆడుకునే రోజులు కొద్ది రోజుల్లోనే వస్తుందన్నారు.
చంద్రబాబు పనికిమాలిన వెధవ: వంగవీటి రాధా
చంద్రబాబు అనే పనికిమాలిన వెధవ, పనికిమాలిన పరిపాలనకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని ఆ పార్టీ నేత వంగవీటి రాధా అన్నారు. చంద్రబాబు వచ్చాక విజయవాడలో దౌర్భాగ్య పరిస్థితి తలెత్తిందన్నారు. నిత్యం ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందన్నారు.
ఏమంటే.. చంద్రబాబు వచ్చారు, పత్తిపాటి వచ్చారు, నారాయణ వచ్చారు, ఎల్లయ్య వచ్చారు, పుల్లయ్య వచ్చారని చెబుతున్నారని మండిపడ్డారు.
కేంద్రం నివేదికను పక్కన పెట్టి, వాస్తు పేరుతో చంద్రబాబు రాజధానిని నిర్మిస్తున్నారని రోజా మండిపడ్డారు. జగన్ హెచ్చరికలతోనే చంద్రబాబులో చలనం కనిపిస్తోందన్నారు. 14 నెలలుగా తాము చంద్రబాబు లాంటి దౌర్భాగ్యుడి పాలనలో ఉన్నామని ప్రజలు బాధపడుతున్నారన్నారు.
జగన్కు కాదు.. చంద్రబాబుకు: జోగి రమేష్
దేవుడు బుద్ది ప్రసాదించాల్సింది జగన్కు అని టిడిపి నేతలు చెబుతున్నారని, కానీ చంద్రబాబుకు, ఆ పార్టీ నేతలకే దేవుడు బుద్ధి ఇవ్వాలని జోగి రమేష్ అన్నారు. రైతుల నుంచి బలవంతంగా భూమిని సేకరిస్తే తమ పార్టీ ఊరుకోదన్నారు.
ఒప్పించి తీసుకోండి: మేకపాటి
చంద్రబాబు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రాజధానిని నిర్మిస్తామని చెబుతున్నారని, అది బాగానే ఉందని, కానీ రైతుల నుంచి బలవంతంగా భూమిని తీసుకోవద్దని మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. భూమి ఇచ్చేందుకు అనాసక్తిగా ఉన్న రైతులను కూడా ఒప్పించి భూమిని తీసుకోవాల్నారు.
ఒకప్పుడు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్న ఏపీని, దుర్మార్గంగా విభజించి ఏపీని నాశనం చేశారన్నారు. ఈ పాపం కాంగ్రెస్, బిజెపి, టిడిపిదే అన్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు ఏమాత్రం తప్పు చేసినా ప్రజలు క్షమించరని గుర్తుంచుకోవాలన్నారు.