అవమానం: ఈటీవి 'జబర్దస్' షోపై పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్: ఈ-టీవీలో ప్రసారమవుతున్న వినోద కార్యక్రమం ‘జబర్దస్త్'పై గౌడ విద్యార్థి సంఘం నాయకులు ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈనెల 18వ తేదీ రాత్రి 9.30కి ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో కల్లుగీత వృత్తిని, గౌడ మహిళలను కించపరిచేలా ద్వందార్థలతో ప్రసారం చేశారని ఆరోపించారు.
అవమానకరంగా చిత్రీకరించిన జబర్దస్త్ టీంను, కార్యక్రమం జడ్జీలను, ఈ-టీవీ యాజమాన్యంపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వట్టికూటి రామారావుగౌడ్, కార్యదర్శి దేశగాని సాంబశివగౌడ్, నారాయణగౌడ్ సీఐ అశోక్రెడ్డిను కలిసి ఫిర్యాదు చేశారు.
కాగా, విద్యార్థుల ఫిర్యాదులో న్యాయపరమైన, ఇతర అంశాలను పరిశీలించి త్వరలో కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. ఈ షోకు ప్రముఖ సినీ నటుడు నాగబాబుతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యురాలు, సినీ నటి రోజా జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. జబర్దస్త్ వినోద కార్యక్రమం విశేషమైన ప్రజాదరణ పొందింది.
హాస్యం, వ్యంగ్యం ప్రధానాంశాలుగా ఈ వినోద కార్యక్రమాలను రూపొందించి ప్రదర్శిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులను ఈ కార్యక్రమం విశేషంగానే ఆకర్షిస్తోంది. ఖతర్నాక్ కామెడీ షో అంటూ జబర్దస్త్కు ట్యాగ్ లైన్ కూడా ఇస్తున్నారు.