తుపాకీతో బెదిరించి వైద్యుడి ఇంట్లో చోరీ: కదిరి ఆలయంలోనూ
గుంటూరు: జిల్లా మాచర్లలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. గురువారం అర్థరాత్రి మాచర్ల పట్టణ సమీపంలోని ఎంఎస్ఆర్ టౌన్షిప్లో నివాసముంటున్న ఓ వైద్యుడి ఇంట్లోకి ముగ్గురు దుండగులు ప్రవేశించారు.
ఇంట్లో ఉన్న నగదు, బంగారం ఇవ్వాలని తుపాకీతో బెదిరించారు. బంగారం, నగదు ఇవ్వకపోతే వైద్యుని భార్యను చంపేస్తామని భయపెట్టారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితులు బంగారు ఆభరణాలు, నగదును దుండగులకు ఇచ్చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు మాచర్ల గ్రామీణ సిఐ శివశంకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కదిరి మరకత మహాలక్ష్మి ఆలయంలో చోరీ
అనంతపురం జిల్లా కదిరిలోని మరకత మహాలక్ష్మి ఆలయంలో చోరీ జరిగింది. గురువారం అర్థరాత్రి ఆలయంలోకి చొరబడిన దుండగులు శఠగోపం, కిరీటం, హుండీ అపహరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఐదు క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న ఐదు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విశాఖపట్నం జిల్లా మాకవరంపాలెం మండలం తామరం గ్రామస్తులు శుక్రవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు ఈ విషయం గురించి సమాచారం అందించారు.
తరచూ రేషన్ బియ్యాన్ని డీలర్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటుండటంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు అక్రమ రవాణా చేస్తున్న వారిని నిర్బంధించి సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు.