మెకానిక్ కుమార్తె: 8 ఐఐఎంలలో ప్రవేశానికి ఎంపికైంది
అమరావతి: ఐఐఐఎం ప్రవేశ పరీక్షలో మెకానికి కుమార్తె సత్తా చాటింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అడపా వైష్ణవి దేశంలోని ప్రతిష్టాత్మకమైన 8 ఐఐఐఎంల నుంచి ప్రవేశానికి అహ్వానాన్ని అందుకుంది.
ఐఐఐఎంలలో ప్రవేశం కోసం జాతీయ స్ధాయిలో నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్టు (క్యాట్)లో 98.07 శాతం మార్కుల సాధించి ఈ ఘనతను సాధించింది. అంతే కాదు కోజికోడ్, ఇండోర్, రాంచి, రాయపూర్, జైపూర్, రోహతక్, తిరుచ్చి, ఉదయ్పూర్ ఐఐఐఎంలతో పాటు ఐఐటీ ముంబై, ఐఐటీ ఢిల్లీల నుంచి ప్రవేశం అందుకుంది.
దీంతో అడపా వైష్ణవిని మీడియా సంప్రదించగా, కోజికోడ్ లేదా ఇండోర్లో ఉన్న ఐఐఐఎంలలో తాను చేరనున్నట్లు తెలిపింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన అడపా వైష్ణవి తండ్రి సంపత్ రాయుడు ద్విచక్ర వాహనాల మెకానిక్ కావడం విశేషం.
తొలి నుంచి చదువులో మంచి ప్రతిభను కనబరుస్తున్న అడపా వైష్ణవి, ఇటీవలే బీటెస్ (సీఎస్ఈ)లో 85.5 శాతం మార్తులతో ఉత్తీర్ణత సాధించింది.