నాలుగేళ్లు తనతో.. ఆపై మరో యువతితో!, పెళ్లయి 24గం. కాకముందే ప్రియురాలి ప్రతీకారం
ఇలియాజ్ మరో పెళ్లి చేశాడన్న వార్త తెలుసుకున్న అతని మాజీ ప్రియురాలు విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. తనకు జరిగిన మోసానికి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది.
గుంటూరు: ప్రియుడి చేతిలో వంచనకు గురైన ఓ యువతి అతనిపై కక్ష సాధించింది. ఏకంగా అతని ప్రాణాలు బలితీసుకుని తన ప్రతీకారం చల్లార్చుకుంది. ప్రేమ పేరుతో వెంటపడి వేధించి.. నాలుగేళ్లు కలిసి తిరిగాక.. ఆపై మరో అమ్మాయిని అతను వివాహం చేసుకోవడం ఆమె ఏమాత్రం సహించలేకపోయింది. పక్కా ప్లాన్ ప్రకారం అతనిపై యాసిడ్ దాడికి పాల్పడింది.
వివరాల్లోకి వెళ్తే.. తాడికొండ మండలం పాములపాడుకు చెందిన ఖాజాపీర్ దంపతులకు ఇలియాజ్ (24) రెండో కుమారుడు. గుంటూరులోని జేకేసీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో.. స్థానిక అభ్యుదయ కాలేజీ విద్యార్థినితో ప్రేమలో పడ్డాడు. తొలుత ఆమె నిరాకరించినప్పటికీ.. వెంటపడి మరీ ప్రేమించేలా చేశాడు.
నాలుగేళ్ల ప్రేమ, ఆపై మరో అమ్మాయితో..:
ఆపై డిగ్రీ మధ్యలోనే వదిలేసిన ఇలియాజ్.. నాలుగేళ్ల పాటు అమ్మాయితో కలిసి తిరిగాడు. నాలుగేళ్ల తర్వాత ఆ అమ్మాయిని వదిలేసి,మరో అమ్మాయిని ప్రేమించడం మొదలుపెట్టాడు. పెదకాకానికి చెందిన రోజ్ మేరీ అనే అమ్మాయిని ఇలియాజ్ ప్రేమించడంతో.. అతని ప్రేమ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలిసి వివాహం జరిపించారు. సోమవారం నాడు పాములపాడు మసీదు వద్ద ముస్లిం సాంప్రదాయ పద్దతుల్లో వీరి వివాహం జరిగింది.
ఫోటోలు ఇవ్వాలని:
ఇలియాజ్ మరో పెళ్లి చేశాడన్న వార్త తెలుసుకున్న అతని మాజీ ప్రియురాలు విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. తనకు జరిగిన మోసానికి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. మాయ మాటలతో ఇలియాజ్ ను తన వద్దకు రప్పించే ప్రయత్నం చేసింది. ఇలియాజ్ స్నేహితుడు ఖాసింకు ఫోన్ చేసి.. తన ఫోటోలు అతని వద్ద ఉన్నాయని, వాటిని ఇప్పిస్తే చాలని ఇంకేం గొడవ చేయనని చెప్పింది.
ఇలియాజ్కు ఫోన్:
దీంతో ఇదే విషయాన్ని ఖాసిం ఇలియాజ్ కు చెప్పాడు. అప్పటికే వివాహ తంతు పూర్తవడంతో కొత్త జంటను అత్తవారింటికి పంపించారు. ఇలియాజ్ అత్తవారింట్లో ఉన్న సమయంలో మాజీ ప్రియురాలి నుంచి ఫోన్ వచ్చింది. ఖాసింతో చెప్పినట్లే ఇలియాజ్ తోను చెప్పింది. తాను వెనిగండ్లలో ఉన్నానని, తన ఫోటోలు ఇచ్చేయాలని కోరింది.
యాసిడ్ దాడితో మృతి:
ఇంట్లోవాళ్లకు బయటకు వెళ్తున్నానని చెప్పి, మధ్యాహ్నాం పూట ఆమెను కలిసేందుకు ఇలియాజ్ బయలుదేరాడు. ఆ తర్వాత 3గం. సమయంలో ఇలియాజ్ పై యాసిడ్ దాడి జరిగినట్లుగా ఇలియాజ్ సోదరుడికి ఫోన్ వచ్చింది. అప్పటికే గుంటూరు ప్రైవేటు ఆసుపత్రికి తరలించిన ఇలియాజ్ వద్దకు కుటుంబ సభ్యులు పరిగెత్తారు. తాను ప్రేమించిన యువతి తనపై యాసిడ్ దాడి చేసిందని, తాను ఎక్కువ రోజులు బతకనని చెప్పుకొచ్చాడు.
ప్రైవేటు ఆసుపత్రి నుంచి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్న సమయంలో.. మార్గమధ్యలోనే ఇలియాజ్ ప్రాణాలు వదిలాడు. దీంతో వివాహం జరిగి 24గం. కూడా గడవకముందే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఖాసింను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.