హరికృష్ణ యాక్టివ్: వనజాక్షికి అండ, రిషికేశ్వరి ఇష్యుపై ఫైర్
హైదరాబాద్: కృష్ణా జిల్లవా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షికి తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూర్ సభ్యుడు, సినీ నటుడు నందమూరి హరికృష్ణ మద్దతుగా నిలిచారు. ఆమెకు బెదిరింపు లేఖ రావడాన్ని ఆయన మంగళవారంనాడు ఖండించారు. వనజాక్షికి అండగా ఉంటామని ఆయన ప్రకటించారు. వనజాక్షికి బెదిరింపు లేఖ రాసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అదే విధంగా నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థిని రిషికేశ్వరి మరణానికి కారణమైనవారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వారు ఎంతటివారైనా సరే వదిలిపెట్టకూడదని ఆయన అన్నారు. సీనియర్ల ర్యాగింగ్ కారణంగా రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
కాగా, గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న హరికృష్ణ మళ్లీ చురుకైన పాత్ర పోషించే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.
ఇప్పుడు వనజాక్షి ఉదంతంపై, రిషికేశ్వరి ఆత్మహత్యపై స్పందించడాన్ని బట్టి కూడా ఆయన రాజకీయాల్లో తిరిగి చురుగ్గా ఉండేందుకు నిర్ణయించుకున్నారని అంటున్నారు.