మేం మోడీని అభినందిస్తున్నాం, మీరేంటి: బీజేపీపై హరీష్, మోడీపై అలీ
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన మంచి పథకాలను తాము అభినందిస్తున్నామని, అలాగే తాము చేపట్టిన మంచి పథకాల పైన విమర్శలు చేయడమేటని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు శుక్రవారం నాడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.
మిషన్ కాకతీయ పైన కిషన్ రెడ్డిది దుష్ప్రచారమన్నారు. మంచిని మంచిగా, చెడును చెడుగా చూడాలన్నారు. తాము మోడీ మంచి కార్యక్రమాలను అభినందించడం లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కిషన్ రెడ్డి రాజీనామా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పత్రికల్లో ప్రచారం కోసం ఇష్టం వచ్చిన ఆరోపణలు చేయవద్దని చెప్పారు.
మిషన్ కాకతీయ పైన చిత్తశుద్ధి ఉంటే చెరువులను దత్తత తీసుకోవాలని కిషన్ రెడ్డికి సవాల్ చేశారు. కేంద్రమంత్రులు దత్తాత్రేయ, వెంకయ్య నాయుడు, గవర్నర్ వంటి వారే మిషన్ కాకతీయ పథకాన్ని అభినందించారని చెప్పారు. కిషన్ రెడ్డి విమర్శలు సరికాదన్నారు.
ఆరెస్సెస్ నేతగా వెళ్లారా?: షబ్బీర్ అలీ
నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు ఆరెస్సెస్ నేతగా వెళ్లారా లేక ప్రధానిగా వెళ్లారా అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ వేరుగా అన్నారు. మోడీ మీటింగులు రాక్ సింగర్ కార్యక్రమాల్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. మోడీకి డ్రెస్సుల పైన ఉన్న శ్రద్ధ రైతు ఆత్మహత్యల పైన లేదన్నారు.
షబ్బీర్ అలీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కూడా నిప్పులు చెరిగారు. కోర్టు చివాట్లు పెట్టినా జీహెచ్ఎంసీ ఎన్నికలపై బుద్ధి రావడం లేదన్నారు. పరిపాలన పైన కేసీఆర్కు పట్టు లేదన్నారు. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
దమ్ముంటే ఎన్నికలు జరపండి: డాక్టర్ కే లక్ష్మణ్
ప్రభుత్వానికి దమ్ముంటే వెంటనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. ఓటమి భయంతోనే తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ ఎన్నికలను నిర్వహించడం లేదని ఆరోపించారు.