అనలేదన్నారు: గోయల్పై హరీష్, అన్లైన్లో సేల్: బాబు
న్యూఢిల్లీ/కర్నూలు/హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పాదన విషయంలో తాను ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా వచ్చిన వార్తలు అవాస్తవమని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చెప్పారని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు సోమవారం ఢిల్లీలో తెలిపారు. హరీష్ రావు, పలువురు తెరాస ఎంపీలు కేంద్రమంత్రులు ఉమాభారతి, పీయూష్ గోయల్ను కలిశారు.
అనంతరం హరీష్ రావు విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడుతోందని తాము కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ అంశం పైన మాట్లాడామని చెప్పారు.
విద్యుత్ ఉత్పత్తి విషయంలో తాను చెప్పినట్లుగా వచ్చిన వార్తలు అవాస్తవమని పీయూష్ చెప్పారని హరీష్ రావు అన్నారు. ఈ విషయమై తాము ఆయనను ప్రశ్నిస్తే... అలా ఎవరన్నారని మంత్రే తమను ఎదురు ప్రశ్నించారన్నారు. కృష్ణా బోర్డుకు మూడుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఉమాభారతికి చెప్పామన్నారు.
విద్యుత్ విషయంలో ఏపీ ప్రభుత్వం ఏ రకంగా ఉల్లంఘనలకు పాల్పడుతుందో తాము తెలిపామన్నారు. కేంద్రం వేసిన కమిటీ నిర్ణయాలను ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 2వ తేదీ తర్వాత విద్యుదుత్పత్తి చేయవద్దని ఎక్కడా లేదన్నారు. రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని కేంద్రమంత్రులకు చెప్పామని, వారు సానుకూలంగా స్పందించారన్నారు.
కేంద్రమంత్రులు ఉమాభారతి, పీయుష్ గోయల్లను కలిసిన వారిలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు ఎంపీలు జితేందర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్ తదితరులు ఉన్నారు.
ఆన్లైన్లో పంటలు అమ్మవచ్చు: చంద్రబాబు
రెండు మూడేళ్ల తర్వాత రైతులు ఆన్ లైన్లోనే పంటలు అమ్మవచ్చునని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం కర్నూలు జిల్లాలో అన్నారు. ఆయన జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, రైతులు తదితరులతో మాట్లాడారు. పోలవరం పూర్తి అయ్యేందుకు నాలుగేళ్లు పడుతుందని చెప్పారు. పోలవరం పూర్తైతే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందన్నారు. ఎర్రచందనం దొంగలతో తాము యుద్ధం చేస్తున్నామన్నారు.
రామోజీ రావుతో రవిశంకర్ భేటీ
హైదరాబాద్ నగరానికి వచ్చిన ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పండిట్ రవిశంకర్ సోమవారం రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీ రావుతో భేటీ అయ్యారు. అనంతరం రామోజీ గ్రూపు సంస్థల ముఖ్య ప్రతినిధుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.