రేవంత్ రెడ్డిని బ్యానేమీ చేయలేదు: హరీశ్, ఓ మెట్టు దిగామని..
హైదరాబాద్: శాసనసభ సమావేశాల సందర్భంగా తెలుగుదేశం సభ్యుడు రేవంత్ రెడ్డిపై బ్యానేమీ విధించలేదని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బ్యాన్ విధించారని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. సభలో లేని ఎంపి పట్ల అసత్య ఆరోపణలు చేయడం వల్లే.. రేవంత్ క్షమాపణకు డిమాండ్ చేశామని అన్నారు.
సభ సజావుగా సాగేందుకు అందరూ సభ్యులను కలుపుకుపోయామని చెప్పారు. పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ ఓ మెట్టుదిగైనా సభను కొనసాగించామని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రతిపక్షాల సూచనలను తీసుకున్నారని, ఆ మేరకు తీర్మానాలు చేశారని అన్నారు. విద్యుత్ సమస్యలపై ప్రతిపక్షాల సూచనలు తీసుకున్నామని చెప్పారు.
సింగిల్ విండో పారిశ్రామిక విధాన బిల్లుకు ప్రతిపక్షాల సూచనలు తీసుకున్నామని, బిల్లు ఆమోదించామని చెప్పారు. బడ్జెట్, ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి సభ్యులందరూ సహకరించారలని అన్నారు. ఇందుకు వారికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. గతించిన ఏపి శాసనసభలో ప్రజల సమస్యలపై ఇంత సుదీర్ఘంగా చర్చ జరగలేదని అన్నారు. సభ్యులందర్నీ మాట్లాడించామని తెలిపారు.
ఇంతకు ముందున్న సమావేశాల్లో ఐదేళ్లలో కూడా అందరికి మాట్లాడే అవకాశం రాకపోయేదన్నారు. ఒంటిగంటకే వాయిదా వేసేవారని, ఇప్పుడలా జరగలేదని తెలిపారు. శాసనసభలు ఎక్కువ సమయంపాటు జరగడం వల్ల జర్నలిస్టులు కూడా కవరేజీ కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. అన్ని సమస్యలపై మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చామని హరీశ్ రావు చెప్పారు.
గత ప్రభుత్వాలకు భిన్నంగా.. రాత్రి 11 గంటల వరకు కూడా సభను నిర్వహించామని తెలిపారు. 1996 తర్వాత పద్దులపై ఇప్పుడే చర్చ జరిగిందని అన్నారు. నియోజక వర్గ సమస్యలపై మాట్లాడే అవకాశం కల్పించడం జరిగిందని చెప్పారు. కాంగ్రెస్, టిడిపి, ఎంఐఎం, మిగితా అన్ని పక్షాలు సమావేశాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశాయని అన్నారు. సభను మెరుగ్గా నడిపేందుకు వారి సూచనలు తీసుకున్నామని తెలిపారు.
భవిష్యత్లోనూ అందరూ సహకరించాలని హరీశ్ కోరారు. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ రావు, సభ్యులు జానారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, లక్ష్మణ్, అక్బరుద్దీన్, డిఎస్, సభ్యులందరికీ ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. సీనియర్ అధికారి సదారం శాసనసభలో ఉండటం అదృష్టమని చెప్పారు. అధికారులు, సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు, మెస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
సమావేశాలు సజావుగా సాగాయి: స్పీకర్
నవంబర్ 5వ తారీఖు నుంచి 29 వరకు శాసనసభ సమావేశాలు 19 రోజుల పాటు సజావుగా సాగాయని స్పీకర్ మధుసూధనాచారి తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మొత్తం శాసనసభ జరిగిన సమయం 88 గంటల పాటు జరిగిందన్నారు. బడ్జెట్పై ఐదు రోజుల పాటు చర్చ జరిగిందని పేర్కొన్నారు.
బడ్జెట్పై 15 గంటలపాటు చర్చ జరిగిందని చెప్పారు. బడ్జెట్పై చర్చలో అన్ని పార్టీలు పాల్గొన్నాయని తెలిపారు. మొత్తం సభ్యులు అడిన 123 ప్రశ్నలకు సభలో జవాబులు వచ్చాయని చెప్పారు. బడ్జెట్పై ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గంట 5 నిమిషాలు ప్రజెంటేషన్ ఇచ్చారని తెలిపారు. బడ్జెట్పై 3 గంటల 40 నిమిషాలు టీఆర్ఎస్, కాంగ్రెస్ 3 గంటల 17 నిమిషాలు1,42 గంటలు ఎంఐఎం, 1.25 గంటలు బీజేపీ, 20 నిమిషాలు వైసీపీ, 21 నిమిషాలు సీపీఐ, సీపీఎం 22 నిమిషాలు బడ్జెట్పై మాట్లాడాయని చెప్పారు. బడ్జెట్పై 2.01 గంటలు ఆర్థిక మంత్రి సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు.
బడ్జెట్పై 7, 11, 12, 13, 14 తేదీల్లో చర్చ జరిగిందని చెప్పారు. బడ్జెట్పై మొత్తం 15 గంటల 17 నిమిషాలు చర్చ జరిగిందని తెలిపారు. అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు జరిగాయని చెప్పారు. సభ్యుల అనర్హతకు సంబంధించిన వివిధ పార్టీల నుంచి ఫిర్యాదులు అందాయని స్పీకర్ తెలిపారు. ఈ విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని చెప్పారు. అయితే ఇటువంటి విషయాలలో గంటలో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదని మధుసూదనాచారి అన్నారు.
అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్రెడ్డి మాట్లాడుతూ... ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలతో సమావేశాలు ముగిశాయని, భవిష్యత్ తరాలకు ఆదర్శవంతంగా ఉండేలా సభ జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ఆర్థరాత్రి వరకు సమావేశాలు నిర్వహించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.