24 గంటల టైమ్: రేవంత్ రెడ్డిని ఏకేసిన హరీష్ రావు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్ తీవ్రంగా మండిపడ్డారు. ఇసుక మాఫియాతో తనకు సంబంధాలున్నాయంటూ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఇసుక మాఫియాపై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరాధారమైనవి, గొబెల్స్ ప్రచారం చేస్తున్నారని తెలంగాణ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.
శుక్రవారం సచివాలంయలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. వాస్తవాలను వక్రీకరించి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను 24 గంటల్లోగా రుజువు చేయకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని మంత్రి హెచ్చరించారు. రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు.
దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ద్రోహిగా నిలబెట్టాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకంగా, ఆంధ్రాకు అనుకూలంగా రేవంత్ మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ మాటలను ఎవరూ నమ్మరని ఆయన అన్నారు ఇదివరకే నిరాధార ఆరోపణలు చేసి నిరూపించలేక తోకముడుచుకున్నాడని అన్నారు.
తమ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను చూసి కళ్లు బైర్లు కమ్మి రాజకీయంగా పుట్టగతులుండవని కొంత మంది రాజకీయ నాయకులు తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారీు. బోడి గుండుకు మోకాలికి సంబంధం అంటగట్టినట్లు రేవంత్ రెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
తమ ప్రభుత్వం అన్ని వైపుల నుంచీ ప్రశంసలు అందుకంటోందని, తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, దీంతో వారికి పుట్టగతులు ఉండవని రేవంత్ రెడ్డి వంటి నాయకులు తమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మరో మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. సాక్ష్యాలు ముందు పెట్టుకుని ఆరోపణలు చేస్తే మంచిదని ఆయన రేవంత్ రెడ్డికి సలహా ఇచ్చారు. ఆరోపణలు చేసే ముందు రేవంత్ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిదని ఆయన అన్నారు.
నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే, అనవసరమైన రాద్ధాంతం చేస్తే సరి కాదని ఆయన అన్నారు. రోజూ పత్రికల్లో కనిపిస్తే హీరో అయిపోతానని రేవంత్ రెడ్డి అనుకుంటుండవచ్చు గానీ జీరో అయిపోతారని ఆయన అన్నారు. నియోజకవర్గాల్లో జరిగే వాటిని తమకు ఆపాదించడం సరి కాదని ఆయన అన్నారు.