హర్షకు బెయిల్, కిరణ్-లగడపాటి వల్ల బాబు సిఎం: దేవినేని ఆసక్తికర వ్యాఖ్య
రాజమండ్రి/విజయవాడ: మాజీ పార్లమెంటు సభ్యుడు హర్ష కుమార్కు హైకోర్టు మంగళవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. రాజమండ్రిలో క్రైస్తవులకు స్మశాన వాటిక కోసమంటూ హర్షకుమార్ కొద్ది రోజుల క్రితం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
స్మశాన వాటిక కోసం స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ హర్ష కుమార్ చేస్తున్న నిరీహార దీక్షను పోలీసులు పుష్కరాలకు ముందు శనివారం రాత్రి భగ్నం చేశారు. తనను తీసుకు వెళ్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ, ఆయన తుపాకీతో నాలుగు రౌండ్లు గాల్లోకి పేల్చాడు.
పరిస్థితి విషమిస్తుండటంతో స్పెషల్ పార్టీ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. తీవ్ర ఉద్రిక్తత మధ్య హర్ష కుమార్ అనుచరులను పక్కకు తప్పించారు. హర్ష కుమార్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తుపాకీనీ స్వాధీనం చేసుకున్నారు. కేసు పెట్టి అరెస్టు చేశారు. ఇప్పుడు బెయిల్ వచ్చింది.
కష్టకాలంలో పార్టీని వదిలేశారు, చరిత్రహీనులు: దేవినేని
కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లిన నేతలు చరిత్రహీనులు అని పిసిసి ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ మంగళవారం మండిపడ్డారు.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు వంటి వారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేందుకు సహకరించారని ఆరోపించారు. గోదావరి పుష్కరాల్లో 27 మంది మృతి చెందినా ఘనంగా నిర్వహించామని చెప్పుకోవడం విడ్డూరమన్నారు.