టీడీపీ మెడకు చుట్టుకుంటుందా?: అసలు సదావర్తి భూములు అంటే?
అమరావతి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి ఆలయానికి చెందిన సదావర్తి భూముల కోనుగోలు అంశం టీడీపీ మెడకు చుట్టుకోబోతుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. టీడీపీ నేతలు కుమ్మక్కై కోట్లు పలికే ఆలయ సదావర్తి సత్రానికి చెందిన భూములను కారుచౌకగా సొంతం చేసుకున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.
అంతేకాదు ఈ భూముల కోనుగోలు తక్షణమే రద్దు చేసి మళ్లీ బహిరంగ వేలం నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఏపీలో సదావర్తి భూముల అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. అసలు సదావర్తి భూములు అంటే ఏమిటి?
గతంలో ధరణికోటను రాజధానిగా పరిపాలించిన రాజావాసిరెడ్డి వెంకట్రాద్రి నాయుడు బ్రాహ్మణులకు అన్నదానం చేసేందుకు గాను సదావర్తి సత్రానికి అప్పట్లో భూములను కేటాయించారు. ఈ భూములనే సదావర్తి భూములు అని పిలుస్తున్నారు. అప్పట్లో బ్రాహ్మణులకు అన్నదానం చేసేందుకు గాను 486 ఎకరాల భూమిని ఆయన కేటాయించారని చరిత్ర చెబుతోంది.
వివరాల్లోకి వెళితే... బ్రాహ్మణులకు అన్నదానం చేసే సదావర్తి సత్రానికి చెందిన 486 ఎకరాల భూముల్లో 86 ఎకరాలను ప్రభుత్వం కాపు కార్పోరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామానుజయకు కట్టబెట్టిందని పేర్కొంటూ బ్రహ్మణ ఫెడరేషన్కు చెందిన ద్రోణంపాటి రవికుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అమరావతి ప్రాంతంలో ఉన్న ఈ సదావర్తి భూముల విలువ ఎకరం రూ.6.30 కోట్లు కాగా, ప్రభుత్వం కేవలం రూ.27 లక్షలకే కట్టబెట్టిందనేది పిటిషనర్ ప్రధాన ఆరోపణ. అయితే ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను జూలై 14కి వాయిదా వేసింది.
ఈ సదావర్తి భూములపై అధికార టీడీపీని వైసీపీ ఇరుకున పెడుతోంది. ఇటీవల ఆపార్టీకి చెందిన సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ భూముల కోనుగోలు తక్షణమే రద్దు చేసి మళ్లీ బహిరంగ వేలం నిర్వహించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్కి ఒప్పుకొంటే ప్రభుత్వానికి ఇంకా లాభమే తప్ప నష్టం రానప్పుడు ఎందుకు వెనుకాడుతోందని ఆయన ప్రశ్నిస్తున్నారు.
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో టీడీపీ నేతలు తమ బినామీలతో భారీగా భూములు కోనుగోలు చేయించారని అప్పట్లో వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వైసీపీ చేసిన ఆరోపణలను టీడీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి మరీ ఖండించారు.
అయితే ఇప్పుడు వైసీపీ చేసిన ఆరోపణలను టీడీపీ నేతలు ఖండించక పోవడం విశేషం. సదావర్తి భూములపై మంత్రి రావెల కిశోర్ బాబు చెప్పిన మాటలు, వైసీపీ ఆరోపణలకు బలాన్ని చేకూర్చుతున్నాయి. సోమవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ చెన్నై సమీపంలో మహాబలిపురం వద్ద గల సదావర్తి భూములు ఆక్రమణకి గురవుతున్న కారణంగానే తక్కువ ధరకి విక్రయించవలసి వచ్చిందని చెప్పారు.
మరోవైపు ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో సరైన వివరాలు తెలియకపోవడం వల్లే తన కుమారుడు, అతని భాగస్వాములు సదావర్తి భూముల వేలానికి వెళ్లి ఇరుక్కుపోయారన్నారని కాపు కార్పోరేషన్ చైర్మన్ రామానుజయ అన్నారు. దీనిని బట్టి చూస్తుంటే వైపీసీ చేస్తున్న ఆరోపణలు ధృవీకరిస్తున్నట్లుగానే ఉన్నాయి.
జూలై 14న ఏపీ ప్రభుత్వం ఇచ్చే సంజాయిషీ సంతృప్తికరంగా లేదని హైకోర్టు భావిస్తే ఈ సదావర్తి భూముల కొనుగోలు వ్యవహారంపై విచారణకు ఆదేశించే అవకాశం లేకపోలేదు. అదే గనుక జరిగితే కారు చౌకగా భూములను అఫ్పగించిన ప్రభుత్వానికి, కొనుగోలు చేసిన వారికి సమస్యలు ఎదురుకావడం ఖాయం.