ఇప్పటికే చస్తుంటే.. ఇంకానా?: తూ.గోలో 52డిగ్రీలకు పెరగనున్న ఉష్ణోగ్రతలు..
వచ్చే 23వ తేదీన తూర్పు గోదావరి జిల్లాలో ఉష్ణోగ్రతలు 52డిగ్రీలకు చేరుకుంటాయని ఇస్రో అధికారులు ప్రకటించారు. దీన్నిబట్టి ఎండలు మరింత మండిపోనున్నాయన్న విషయం స్పష్టమవుతోంది.
ఏలూరు: తెలంగాణ-ఆంధ్రప్రదేశ్లలో ఎండలు దంచికొడుతున్నాయి. రోళ్లు సైతం పగిలిపోయేలా ఉష్టోగ్రతలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఎండదెబ్బకు పగటిపూట ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. రెండు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 47డిగ్రీల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.
ఇలాంటి తరుణంలో ఇస్రో మరో బాంబు పేల్చింది. వచ్చే 23వ తేదీన తూర్పు గోదావరి జిల్లాలో ఉష్ణోగ్రతలు 52డిగ్రీలకు చేరుకుంటాయని ఇస్రో అధికారులు ప్రకటించారు. దీన్నిబట్టి ఎండలు మరింత మండిపోనున్నాయన్న విషయం స్పష్టమవుతోంది. 40డిగ్రీలు దాటితేనే జనం విలవిలలాడిపోతుంటే.. ఇక 52డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతే.. అసలు జనమెవరు కాలు బయటపెట్టరేమో!.
ఇస్రో చెప్పిన విషయాన్ని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ కూడా ధ్రువీకరించారు. ముఖ్యంగా కోనసీమలోని అమలాపురం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాలతో పాటు కాకినాడ సమీపంలో ఉండే ఉప్పాడ, కొత్తపల్లి మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవనున్నట్లు తెలుస్తోంది. ఎండ తీవ్రత నేపథ్యంలో జిల్లాలో భారీ సంఖ్యలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. వీలైనంత వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని కలెక్టర్ సూచించారు.