భారీ వర్షం, మెట్రోతో ఇబ్బంది: ఓ వైపు ఇబ్బంది-మరోవైపు సంతోషం
హైదరాబాద్: భాగ్యనగరంలో నాలాలను ప్రక్షాళన చేసేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరముందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారం అన్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక రూపొందిస్తే కేంద్రంతో మాట్లాడి దానికి కావాల్సిన నిధులు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు.
భారీ వర్షానికి పొంగిపొర్లుతున్న నారాయణగూడ ఆదర్శ్ బస్తీ పక్కనే ఉన్న నాలాలను దత్తాత్రేయ, స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే నగరంలో ఈ దుస్థితి నెలకొందన్నారు.
వర్షాలు వచ్చినప్పుడే తాత్కాలికంగా చర్యలు తీసుకుని ఆ తర్వాత పట్టించుకునే వారు లేరన్నారు. మూసీనది వరకు వెళ్లే నాలాకు ఇరువైపులా వెడల్పు చేసి ప్రహారీ గోడ నిర్మించి భవిష్యత్తులో బస్తీవాసులకు ఎలాంటి ప్రమాదం లేదా ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.
నదిని తలపిస్తున్న నగరం
హైదరాబాదులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నాచారంలోని ప్రధాన రహదారిపై నాలా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రదాన రహదాపై పోంగుతున్న నాలా నదిని తలపిస్తోంది. నాచారం-మల్లాపూర్ దారిని పోలీసులు మూసివేశారు.
భాగ్యనగరం అతలాకుతలం
భాగ్యనగరాన్ని వర్షాల భయం వెంటాడుతోంది. తరుచూ కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలతో నగరం చిగురుటాకులా వణికిపోతోంది. ఇప్పటికే మంగళ, బుధవారాల్లో రెండు రోజుల పాటు కురిసిన వర్షాల షాక్ నుంచి నగరం తేరుకోకముందే గురువారం.. శుక్రవారం కూడా అడపాదడపా కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది.
రెండు రోజులు సెలవు
శుక్రవారం కూడా భారీ వర్ష సూచన ఉండటంతో ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. ఇప్పటికే నీట మునిగిన ప్రాంతాల్లో గురువారం మంత్రి కెటిఆర్, మేయర్ బొంతు రామ్మోహన్ పర్యటించారు. 50 అపార్టుమెంట్లలోని సెల్లార్లలో నిండిన నీటిని అగ్నిమాపక శాఖ అధికారులు మోటార్లను పెట్టి బయటకు తోడేయటాన్ని కెటిఆర్ పరిశీలించారు.
ఢిల్లీ నుంచి సమీక్ష
ఢిల్లీలో ఉన్న సిఎం కెసిఆర్ ఎప్పటికపుడు మంత్రి కెటిఆర్, కమిషనర్ జనార్దన్ రెడ్డిలకు ఫోన్ చేస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, అవసరమైతే సైన్యాన్ని రంగంలో దించాలని సూచించారు.
వాతావరణ శాఖ హెచ్చరికలు
గడిచిన కొద్దిరోజులుగా వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికల ప్రకారం నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో జంటనగరాలు, శివారు ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం అర్థరాత్రి ఓ మోస్తారుగా వర్షం కురిసినా, గురువారం ఉదయం కాస్త ఎండ కొట్టడంతో ఇక వర్షం బాధలు తీరాయని నగరవాసులు భావించారు. కానీ అప్పటికే శివార్లలో వర్షం కురుస్తోంది. ఫలితంగా లుంబినీ పార్కులోకి మూడు అడుగుల వరద నీరు ప్రవహించింది.
2000 తర్వాత మళ్లీ ఇప్పుడు
2000 సంవత్సరంలో నగరాన్ని వరదలు ముంచెత్తిన తర్వాత లుంబినీ పార్కులోకి మరోసారి నీరు వచ్చింది. ఇప్పటికే నీట మునిగిన నిజాంపేటలోని ఈ వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. గురువారం నాడు పాతబస్తీలోని మాదన్నపేట రెయిన్బజార్ సమీపంలో రెండంతస్తుల పాతకాలపు భవనం కుప్పకూలింది. ఇందులో ఎవరూ నివాసం లేకపోటవంతో పెనుప్రమాదం తప్పింది.
మెట్రో రైలు ఎఫెక్ట్.. ఎల్ అండ్ టీ పై చర్యలు తీసుకోవాలని ఆగ్రహం
మెట్రో రైలు పనులు జరుగుతున్న 62 కి.మీ.లోని మూడు కారిడార్ల ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమైంది. ఈ ప్రాంతాల్లో రోడ్లకు ఎప్పటికపుడు మరమ్మతులు చేపట్టాల్సిన బాధ్యత ఎల్ అండ్ టిపై ఉన్నా, ఆ సంస్థ పట్టించుకోకపోవటంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. అడుగడుగున గుంతలతో అష్టకష్టాలు పడుతున్న నగరవాసులు ఎల్ అండ్ టి సంస్థపై చర్యలు తీసుకోవల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
వరంగల్-ఖమ్మం రహదారి జలమయం
భారీ వర్షంతో ఖమ్మం-వరంగల్ ప్రధాన రహదారి చెరువులా మారింది. ఎడతెగని వర్షానికి హంటర్ రోడ్డులో రాకపోకలు స్తంభించాయి. దాదాపు కి.మీ. మేర వరదనీరు రహదారిపై నుంచే ప్రవహిస్తుండటంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. హంటర్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న నివాసాలు పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఇళ్లలో మోకాలు లోతు నీళ్లు ప్రవహిస్తోంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ట్రాఫిక్ నరకం
గురువారం మళ్లీ భారీవర్షం కురిసింది. దీంతో నగర ప్రయాణికులకు మళ్లీ అవే కష్టాలు మొదలయ్యాయి. రోడ్డు ఎక్కి కి.మీ. ప్రయాణించాలంటే గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిందేనని జిహెచ్ఎంసి అధికారులపై ప్రయాణికులు మండిపడుతున్నారు. గురువారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి మెహిదీపట్నం నుంచి లక్డీకాపూల్ వరకు ప్రయాణించాలంటే గంట పాటు సమయం పట్టిందని ప్రయాణికులు ఆరోపించారు.
హరీష్ రావు సమీక్ష
గత ఇరవయ్యేళ్లలో సీమాంధ్ర పాలకులు చేసిన తప్పిదాల కారణంగానే హైదరాబాద్ నగరానికి ఈ దుస్థితికి నెలకొందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎన్నడూలేని విధంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయన్నారు. వరద పరిస్థితిపై ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్, స్థానికంగా మంత్రులు, అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు.
ఓ వైపు ఇబ్బంది, మరోవైపు సంతోషం
వరద సమాచారం కోసం కలెక్టర్, నీటిపారుదల శాఖ ఎస్ఈ కార్యాలయాల్లో కాల్సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఓ వైపు భారీవర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ, మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జలాశయాలు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకోవడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనేకచోట్ల చెరువులకు గండ్లు పడ్డాయని, వాటిని పూడ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
కేసీఆర్ సమీక్ష
అసాధారణ వర్షాల వల్ల కలిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, వరదల పరిస్థితిని తెలుసుకున్నారు. భారీ వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడటం బాధాకరం అన్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.
నివేదిక తయారు చేయాలని ఆదేశం
రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల వల్ల చెరువులు తెగిపోవడం, గండ్లు పడటం, పంటలు దెబ్బతినడం వంటి నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు స్థిరాస్తులకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు, పంటనష్టం, మౌలిక వసతులకు కలిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రాన్ని కోరే అవకాశముంది.