'కాంగ్రెస్ కంటే దుర్మార్గం.. బీజేపీని తరిమికొట్టండి' : హోదాపై శివాజీ
విజయవాడ : ప్రత్యేక హోదా విషయంలో కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తీవ్రంగా తప్పుబట్టారుఏపీ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, తెలుగు సినీ హీరో శివాజీ. బీజేపీతో పాటు మిత్రపక్షంగా కొనసాగుతోన్న టీడీపీ వైఖరిని కూడా తీవ్రంగా వ్యతిరేకించారు.
ప్రత్యేకహోదాపై రాజ్యసభలో ఆర్థికమంత్రి ఇచ్చిన వివరణపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన శివాజీ.. 'బీజేపీని తరిమికొట్టండి.. అది కాంగ్రెస్ కంటే దుర్మార్గంగా వ్యవహరిస్తోంది' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పేరు వినబడితే చాలు తరిమికొట్టాలని.. అలా అయితేనే బీజేపీకి బుద్ది వస్తుందని చెప్పుకొచ్చారు. ప్రత్యేక ఏపీ ప్రజల హక్కు అని దాన్ని సాధించే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రకటించారు శివాజీ.
ఇక కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు గురించి ప్రస్తావిస్తూ.. ఆనాడు పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరిన వెంకయ్య నేడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు శివాజీ. ప్రతీ ఆంధ్రుడు ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని, ఇది ప్రతీ ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారాయన.
బీజేపీతో టీడీపీ మిత్రపక్షంగా కొనసాగడాన్ని తప్పుబట్టిన శివాజీ.. టీడీపీని అన్నగారు ఎన్టీఆర్ గారు స్థాపించారని ఏమాత్రం అభిమానం ఉన్నా.. బీజేపీతో మిత్రపక్షం నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో ఎంపీ సుజనాచౌదరి విఫలమయ్యారన్నట్లుగా ఆరోపణలు చేసిన శివాజీ అసలు ఏ ఉద్దేశంతో సుజనాచౌదరిని చంద్రబాబు కేంద్రానికి పంపించారని నిలదీశారు. బీజేపీ నైజం ఏంటో పూర్తిగా బయటపడింది కాబట్టి ఇప్పటికైనా కేంద్రం నుంచి బయటకు రావాలని టీడీపికి సూచించారు.