పవన్ కల్యాణ్ మాట హీరో శివాజీ నోట: మోడీపై నిప్పులే
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు హీరో శివాజీ బాసటగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణాదిపై వివక్ష ప్రదర్శిస్తున్నారనే మాట ఆయన నోట కూడా వచ్చింది.
విజయవాడ: జనసేన పవన్ కల్యాణ్ మాట సినీ హీరో శివాజీ నోట వినిపిస్తోంది. దక్షిణాది పట్ల కేంద్ర ప్రభుత్వం, బిజెపి వివక్ష ప్రదర్శిస్తోందని ఇటీవల పవన్ కల్యాణ్ నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. అదే మాటను శివాజీ కూడా పలికారు.
భారతదేశవ్యాప్తంగా ఆధిపత్యం కోసం ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా కలసి కుట్ర, కుతంత్రాలతో దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, ఉద్యమ నేత, సినీ నటుడు శివాజీ నిప్పులు చెరిగారు.
గురువారం విజయవాడ ప్రెస్క్లబ్లో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలన్నింటినీ అమలుపరచేవరకు కూడా ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసేవారందరినీ తరిమి కొట్టాలని వారు పిలుపునిచ్చారు.
ఉద్దేశపూర్వకంగా దేశంలో ప్రాంతీయ పార్టీలను సర్వనాశనం చేసేందుకు పూనుకున్న బిజెపి, తాజాగా మహారాష్టల్రో శివసేనను మట్టి కరిపించేందుకు, కర్ణాటకలో తిరిగి పాగా వేసేందుకే తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కల్పించేలా కృష్ణా జలాల వివాదంలో బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్లోనే కాకుండా సుప్రీంకోర్టులోనూ అఫిడవిట్ దాఖలు చేసిందని వారు ధ్వజమెత్తారు.
కెసిఆర్కు అనుకూలంగా..
తెలంగాణాలో సిఎం కెసిఆర్ వివిధ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడంతో, అక్కడ తమ ఉనికిని కాపాడేందుకే కేంద్రం ఉమ్మడి ఆస్తుల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగేలా తాజాగా ఉత్తర్వులు జారీ చేసిందని శివాజీ, శ్రీనివాస్ అన్నారు. అసలు వీటన్నింటిపై సిఎం చంద్రబాబు ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు.
బాబుపైనా వారు నిప్పులు...
చంద్రబాబు తన జన్మదినం రోజున ఆంధ్రుల ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాటానికి నిర్ణయం తీసుకోవాలని శివాజీ, శ్రీనివాస్ అన్నారు. విభజన చట్టం హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కనీసం 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలి, అదే సంజీవని అంటూ సిఎం చంద్రబాబు వెంకన్న సాక్షిగా నాడు ప్రధానిని కోరిన విషయాన్ని గుర్తు చేశారు.
జగన్ను దొంగగా ఈనాడు..
ప్రత్యేక హోదాపై ఆనాడు చంద్రబాబు చెప్పిన మాటలను ప్రస్తావించే జగన్ను దొంగా.. వామపక్షాలకు సీట్లు రాలేదంటూ ఎదురు దాడికి దిగగడం దారుణమని వారన్నారు. అదేమని అడిగితే జగన్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారని అంటారని అన్నారు. అయితే సిఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కోట్లాది రూపాయలతో అక్కడే ఎందుకు నివాసం ఏర్పరచుకున్నారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆ హోదా కల్గిన రాష్ట్రాలకు రాయితీలు ఇస్తూ జిఎస్టి చట్టాన్ని ఎలా ఆమోదించారని ప్రశ్నించారు.
ఇటు హీరో శివాజీ అటు గద్దర్
దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం, బిజెపి వివక్ష ప్రదర్శిస్తోందనే విమర్శలను ఎక్కుపెడుతూ దక్షిణాది రాష్ట్రాల రాజకీయ నేతలను, సాంస్కృతిక కళాకారులను ఏకం చేయడానికి పవన్ కల్యాణ్ నేతృత్వంలో తెలంగాణ గద్దర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శివాజీ పనిచేస్తారనే సంకేతాలు అందుతున్నాయి. శివాజీ పవన్ కల్యాణ్తో కలిసి పని చేసే అవకాశాలు కూడాలేకపోలేదని అంటున్నారు.