బాబుకు హైకోర్టు షాక్: వీజీటీఎంలో యథావిధిగా రిజిస్ట్రేషన్లు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు గురువారం షాకిచ్చింది! వుడా పరిధిలో భూమార్పిడి లే అవుట్ల నిషేధంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన మెమో మీద హైకోర్టు స్టే విధించింది. రియల్ ఎస్టేట్ దందాకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ 22న జారీ చేసిన ఉత్తర్వు మీద హైకోర్టు స్టే విధించింది.
భూ వినియోగం మార్పిడికి సంబంధించి లే అవుట్లకు అనుమతి ఇవ్వకూడదని వుడాను ఆదేశించింది. రిజిస్ట్రేషన్లు యథాతథంగా చేసుకోవచ్చునని తెలిపింది. ఈ ఆదేశాలు ఈ ఏడాది జూన్లో ఇచ్చినప్పటికీ ఈ తర్వాత వుడా పాలక వర్గం ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేసింది.
రియల్టర్లతోపాటు సామాన్య వినియోగదారుల నుంచి కొత్తగా వాణిజ్య, పారిశ్రామికవేత్తల నుంచి ల్యాండ్ కన్వర్షన్ వెంటనే చేపట్టాలని ఒత్తిడి వస్తోందని, అందువల్ల వెంటనే భూమార్పిడికి సంబంధించి అనుమతి ఇవ్వాలని కోరారు. అప్పటివరకు మౌలిక ఆదేశాలు మాత్రమే ఉన్నాయి. దీనికి లిఖితపూర్వక ఆదేశాలు ఇస్తే తాము పూర్తిస్థాయి అమలులోకి తీసుకువస్తామని కూడా కోరింది.
అయితే వుడా విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ 22న భూమార్పిడితోపాటు లే అవుట్ను కూడా నిషేధిస్తూ, ఎట్టి పరిస్థితుల్లో వుడా అనుమతులు ఇవ్వకూడాదని దీనికి సంబంధించిన ఫైల్స్ను కూడా ప్రొసెస్ చేయవద్దని ప్రభుత్వం జారీ చేసింది.
ఈ ఉత్తర్వులపై పలువురు రియల్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. భూమార్పిడితోపాటు లే అవుట్ల అనుమతులను రద్దు చేయడం అన్యాయమని, ఇది రాజ్యాంగంలో ఎక్కడా లేదని, అపే హక్కు ప్రభుత్వానికి కూడా లేదని తమ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే అవకాశముంది.