ముద్రగడ ఇంటి వద్ద హైడ్రామా: కార్లు అడ్డం, ఎస్పీ హెచ్చరిక
కాకినాడ: ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. కిర్లంపూడిలోని ఆయన ఇంటి వద్ద ఆదివారం రాత్రి తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. దీక్షను భగ్నం చేస్తారనే సంకేతాలు అందడంతో తన ఇంటి తలుపులకు అడ్డంగా ముద్రగడ కార్లను పెట్టించుకున్నారు. కార్లను తొలగించే పనిలో పోలీసులు ఉన్నారు.
శనివారం నుంచి కూడా ముద్రగడ పద్మనాభం వైద్య పరీక్షలకు నిరాకరిస్తున్నారు. సొంత వైద్యులతోనైనా ముద్రగడ దంపతులు వైద్య పరీక్షలు చేయించుకోవాలని, లేదంటే వేరే రకంగా వ్యవహరించాల్సి ఉంటుందని జాయింట్ కలెక్టర్ అన్నారు.
ఆహారం తీసుకోకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ముద్రగడ చేతనలోనే ఉన్నారని, అయితే ఆహారం తీసుకోకపోతే అకస్మాత్తుగా స్పృహ కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ముద్రగడ పద్మనాభం ఆదివారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఇంట్లో లైట్లు ఆర్పేసి విశ్రాంతికి వెళ్లారు. కాపు కార్యకర్తలు ముద్రగడ ఇంటి వద్ద నినాదాలు చేస్తున్నారు.
కాగా, ముద్రగడ ఇంటిని పోలీసులు చుట్టుముట్టడంతో జిల్లా ప్రజలు భయాందోళనలు చెందుతున్నారని ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. ముద్రగడ్డ దీక్షపై కొన్ని చానళ్లలో వస్తున్న వార్తలను ఖండిస్తున్నామన్నారు. మీడియా బాధ్యతాయుతంగా వ్వవహరించాలని సూచించారు.
శాంతిభద్రతలను కాపాడటం తమ కర్తవ్యమని, ప్రభుత్వం విధించిన 144 సెక్షన్ను అమలుచేసి తీరుతామని పేర్కొన్నారు. వైద్య పరీక్షలకు ముద్రగడ సహకరించడం లేదని ఆయన తెలిపారు. వైద్యులు సూచన చేసేవరకు తదుపరి చర్యలు తీసుకోబోమని రవిప్రకాష్ స్పష్టం చేశారు.
కిర్లంపూడికి ఎవరూ రావద్దని, తూర్పు గోదావరి జిల్లాలో శాంతిభద్రతల సమస్య ఉందని, ఎక్కడి వారు అక్కడ సంఘీభావం తెలపాలని ఆయన అన్నారు. తుని లాంటి సంఘటనలు చోటు చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారు, తామే సమాధానం చెప్పాల్సి వస్తుందని ఆయన అన్నారు.
చిరంజీవికి హెచ్చార్సీ అనుమతి
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డికి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ) కిర్లంపూడి వెళ్లి ముద్రగడను పరామర్శించడానికి అనుమతి ఇచ్చింది. పోలీసులు కిర్లంపూడికి అనుమతి నిరాకరిస్తున్న నేపథ్యంలో వారు హెచ్చార్సీని ఆశ్రయించారు.
బేషజాలకు పోవద్దని మంత్రి నారాయణ
ముద్రగడ పద్మనాభం బేషజాలకు పోకుండా దీక్ష విరమించాలని మంత్రి నారాయణ కోరారు. కాంగ్రెస్ నేతలు పదేళ్లు అధికారంలో ఉండి కాపులకు ద్రోహం చేశారని ఆయన ఆదివారం మీడియా సమావేశంలో ఆరోపించారు. కాంగ్రెస్ నేతలకు సంఘీభావం చెప్పే అర్హత కూడా లేదని విమర్శించారు. కాంగ్రెస్ నేతల సంఘీభావం తీసుకుంటే కాపులకు అవమానించినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు.
2008లో సుబ్రహ్మణ్యం కమిటీ కాపులను బీసీల్లో చేర్చే అంశంపై 2 శాతం సర్వే చేసేందుకు రూ.45 లక్షలు అడిగారని తెలిపారు. 2011లో ముష్టిగా రూ.10 లక్షలు ఇచ్చారని చెప్పారు. తాత్కాలిక సచివాలాయానికి ఫైనాన్షియల్ బిడ్లు ఓపెన్ చేశామని నారాయణ తెలిపారు.
చదరపు అడుగుకు రూ.3 వేలు ఖరారు చేస్తే..కంపెనీలు ఎక్కువ కోడ్ చేశాయని ఆయన అన్నారు. రేపు సా.4 గం..లకు కంపెనీల ప్రతినిధులతో సీఆర్డీఏ అధికారుల భేటీ కానున్నారని.. సమావేశం తర్వాత స్పష్టత వస్తుందని నారాయణ పేర్కొన్నారు.
వేయి కోట్లు కేటాయించాం
కాపుల సంకేమానికి వచ్చే ఏడాది బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించనున్నట్టు రాష్ట్ర హోంశాఖా మంత్రి చినరాజప్ప తెలిపారు.ఇప్పటికే కాపులకు కార్పొరేషన్ ఏర్పాటుచేసి వంద కోట్ల రూపాయాలు కేటాయించామని ఆయన ఆదివారం మీడియాతో అన్నారు.
ఈ ఏడాది ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కార్పొరేషన్కు వెయ్యి కోట్లు ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఏడాది వచ్చిన దరఖాస్తులన్నింటికీ అవసరమైన నిధులు కేటాయించాలని నిర్ణయించినట్టు హోంమత్రి చెప్పారు. ముద్రగడ వైద్య పరీక్షలకు నిరాకరిస్తున్న విషయాన్ని ప్రస్తావించగా దీక్షకు దిగిన వారికి నిబంధనలను అనుసరించి నిర్ణీత సమయాల్లో వైద్య పరీక్షలు నిర్వహించాల్సి వుంటుందని చినరాజప్ప అన్నారు.
ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది..
కాపులను బీసీల్లో చేర్చే అంశంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలుగుదేశం పార్టీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు.ప్రభుత్వానికి సహకరించి ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించాలని ఆయన మీడియా సమావేశంలో కోరారు.
ముద్రగడ ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. వీలైతే కాపు సంఘాల నాయకులు తగిన సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. చంద్రబాబుపై ముద్రగడ వ్యక్తిగత విమర్శలు చేయడం దురదృష్టకరమని మాణిక్యవరప్రసాద్అన్నారు.