ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్; టీడీపీకి హైకోర్టు షాక్..
కడప,కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పర్వం ముగిసింది. కడప,కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. కర్నూలు జిల్లాలో మొత్తం 1083 ఓటర్లకు గాను 1,076మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కడపలో 841 ఓట్లకు గాను 838, నెల్లూరులో 852కి గాను 849 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నెల్లూరులో 5 చోట్ల, కర్నూలు 3 చోట్ల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా ముగియగా.. ఈ నెల 20న ఫలితాలు వెలువడనున్నాయి.
హైకోర్టులో టీడీపీకి చుక్కెదురు:
కంపానియన్ ఓటు కోసం హైకోర్టును ఆశ్రయించిన టీడీపీకి చుక్కెదురైంది. గడువు లోగా దరఖాస్తు చేసుకోనందునా పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. ఫారం-14ఏ ప్రకారం అంధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, నిరక్ష్యరాస్యులు కంపానియన్ ఓటు కిందకు వస్తారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన బలం లేకపోయినందువల్ల కంపానియన్ ఓటుతో లబ్ది పొందాలని చూసిన టీడీపీ ఆ దిశగా ప్రయత్నాలు చేసింది. మొత్తం 47మందికి కంపానియన్ ఓటు ఇవ్వాలని టీడీపీ దరఖాస్తు చేసింది. అయితే ఇందుకోసం గడువు లోగా వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా.. గడువు ముగిసిన తర్వాత ఈమెయిల్స్ ద్వారా టీడీపీ దరఖాస్తు చేసింది.
అయితే ఈసీ నిర్ణయం టీడీపీకి ప్రతికూలంగా రావడంతో వారు హైకోర్టులో రిపిటిషన్ వేశారు. మొత్తం 47పిటిషన్ లను ఈసీ తిరస్కరించింది. జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన 10మందికి కంపానియన్ ఓటు సౌకర్యం కల్పించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.
హైకోర్టు సైతం ఈసీ నిర్ణయాన్నే సమర్థించడంతో టీడీపీకి చుక్కెదురైనట్లయింది. కాగా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలో 841మంది ఓటర్లు ఉండగా.. వీరిలో కేవలం 10మాత్రమే నిరక్ష్యరాస్యులు కావడం గమనార్హం. ఈ పది ఓట్ల కోసమే టీడీపీ కంపానియన్ ఓటు కోసం దరఖాస్తు చేసుకుంది. బూత్ లోపలికి వెళ్లాక వీళ్లు టీడీపీకి వ్యతిరేకంగా ఓటేస్తారన్న భయంతోనే అధికార పార్టీ ఇలా వ్యవహరించిందని హైకోర్టు తెలిపింది.