బుల్లెట్ నడుపుతూ బాలకృష్ణ సందడి: సైకిల్ తొక్కిన బాబు
అనంతపురం: జిల్లాలోని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ రెండో రోజు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పట్టణంలోని పాండురంగనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ మున్సిపల్ పార్క్ను ఆయన శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా పార్క్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పాలాభిషేకం చేశారు. అనంతరం కెరికెర బసవనపల్లిలోని ఉన్నత పాఠశాల ఆవరణలో రూ.39లక్షలతో నిర్మించిన నూతన భవనాలను బాలకృష్ణ ప్రారంభించారు.
అంతకుముందు ఆటోనగర్ నుంచి బైక్ ర్యాలీతో పాఠశాల వద్దకు చేరుకున్నారు. బాలయ్య స్వయంగా బుల్లెట్ నడుపుతూ.. అభిమానులకు అభివాదం చేస్తూ అలరించారు. బాలయ్యను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు.
సైకిల్ తొక్కిన చంద్రబాబు
శనివారం బాలకృష్ణ బుల్లెట్ వాహనం నడుపుతూ సందడి చేస్తే.. అంతకుముందు శుక్రవారం రాత్రి టిడిపి అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బాలకృష్ణ బావ సైకిల్ తొక్కారు. ఉండవల్లిలోని అతిథి గృహం దగ్గర చంద్రబాబు ఎలక్ట్రిక్ సైకిల్ తొక్కారు.