వాళ్లంతలా వేడుకుంటుంటే.. బాలయ్య మాత్రం నిర్లక్ష్యంగా ఇలా!
ఇంటి పట్టాలు ఇవ్వడంతో.. సొంతిళ్లు కట్టుకోవాలని చాలామంది పునాదులు కూడా వేసుకున్నారని, తీరా ఇప్పుడు వాటిని వేరేవాళ్లకు కేటాయిస్తే తమ పరిస్థితేంటని తహశీల్దారును మహిళలు నిలదీశారు.
హిందూపురం: సినిమా బిజీలో పడి అసలు నియోజకవర్గాన్ని పట్టించుకోవడమే మానేశారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. ఏదో షూటింగ్ మధ్యలో విరామాల్లో తప్పితే.. నియోజకవర్గం వైపు ఆయన తొంగైనా చూడటం లేదని అక్కడి జనం గగ్గోలు పెడుతూనే ఉన్నారు.
స్టార్ వార్: 2019లో అనంతపురంలో పవన్ కళ్యాణ్ Xబాలయ్య, ఎవరిది పై చేయి?
బాలయ్య తీరును నిరసిస్తూ.. గతంలో బర్రెల మీద ఆయన పేరు రాసి హిందూపురం ప్రజలు నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. మొన్నామధ్య తమ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఇక తాజాగా నియోజకవర్గంలోని మహిళలంతా ఏకమై ఎమ్మెల్యే ఇంటిముందు ఆందోళనకు దిగారు.
ఇంటి పట్టాలు రద్దు:
గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేసి వాటిని ఇతరులకు కేటాయిస్తున్నామని రెవెన్యూ అధికారులు చెబుతుండటంతో.. హిందూపురం మహిళలు గుండెలు బాదుకుంటున్నారు. ఇదే క్రమంలో తమను రోడ్డున పడేయవద్దని వేడుకుంటూ హిందూపురంలోని ఇందిరమ్మ కాలనీలోని మహిళలు ఎమ్మెల్యే ఇంటిముందుకు చేరారు.
బాలయ్యకు వినతి:
ఉదయం 7గం. నుంచే మహిళలంతా బాలయ్య ఇంటిముందు ఆయన కోసం వేచియున్నారు. వారిని లోపలకు అడుగపెట్టనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. చాలాసేపటికి.. దాదాపు 11గం. సమయంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటినుంచి బయటకు వచ్చారు. దీంతో బాధిత మహిళలు తమ గోడు వినిపించేందుకు సిద్దపడగా.. ఎమ్మెల్యే మాత్రం పట్టీ లేనట్లుగా వ్యవహరించారు.
నిర్లక్ష్యంగా సమాధానం:
ఇంటి పట్టాలు రద్దు చేసి వెళ్లిపొమ్మంటున్నారు.. ఇప్పుడు ఎక్కడికని పోవాలయ్యా.. ఇదేమి న్యాయమయ్యా! అంటూ బాలకృష్ణ ముందు మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కొత్త ఇళ్లు కట్టిస్తామని హామి ఇచ్చి.. ఇప్పుడేమో పట్టా ఇళ్లను లాక్కోవాలనుకంటే ఎలా? అంటూ వాపోయారు. తమకు న్యాయం జరిగేవరకు అక్కడి నుంచి కదిలేది లేదన్నారు. దీంతో తహశీల్దార్ విశ్వనాథ్ ను పిలిపించిన బాలకృష్ణ.. సమస్యను పరిష్కరించాలని ఆయనతో చెప్పి లోపలికి వెళ్లిపోయారు.
తహశీల్దార్తో వాగ్వాదం:
ఇంటి పట్టాలు ఇవ్వడంతో.. సొంతిళ్లు కట్టుకోవాలని చాలామంది పునాదులు కూడా వేసుకున్నారని, తీరా ఇప్పుడు వాటిని వేరేవాళ్లకు కేటాయిస్తే తమ పరిస్థితేంటని తహశీల్దారును మహిళలు నిలదీశారు. మీకు కావాల్సిన వారి కోసం మాకు అన్యాయం చేస్తారా? అని ప్రశ్నించారు. తమను బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు.
'ఎమ్మెల్యే సార్.. మేం ఆత్మహత్య చేసుకుంటాం' అని ఓ మహిళ కాగితంపై రాస్తుండగా.. పోలీసులు దాన్ని చించేశారు. ఇంతలో బయటకు వచ్చిన బాలకృష్ణకు మహిళలు మరోసారి తమ ఆవేదన చెప్పుకునే ప్రయత్నం చేయగా.. తహశీల్దారు చూసుకుంటారులేమ్మా.. అంటూ ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.