ఏపీలో రైలు ప్రమాదం, ముందే పేలుడు తరహా శబ్ధం: ఐఎస్ఐ కుట్ర?
ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగిన హిరాఖండ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో ఐఎస్ఐ కుట్ర ఉందనే అనుమానాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
విజయనగరం: ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగిన హిరాఖండ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో ఐఎస్ఐ కుట్ర ఉందనే అనుమానాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం నేపథ్యంలో ఆ దిశలో ఎన్ఐఏ (జాతీయ దర్యాఫ్తు సంస్థ) విచారణ చేస్తోంది.
(పిక్చర్స్) ఏపీ సీఐడీ విచారణ: రైలు ప్రమాదంపై తీవ్రంగా స్పందించిన పవన్ కళ్యాణ్
వరుస రైలు ప్రమాదాలం జరుగుతుండటంతో ఐఎస్ఐ ప్రమేయం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇండోర్, పాట్నాలలో జరిగిన రైలు ప్రమాదాల్లోను ఐఎస్ఐ పైన అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎన్ఐఏతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది.
రంగంలోకి సీఐడీ, ఎన్ఐఏ
హిరాఖండ్ రైలు పట్టాలు తప్పిన దుర్ఘటనపై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. జాతీయ దర్యాప్తుసంస్థా రంగంలోకి దిగుతుంది. రైల్వే శాఖా దర్యాప్తు జరపనుంది.
కారణాలు ఏమిటి?
హిరాఖండ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి అసలు కారణం ఏంటన్న దానిపై అధికారులు స్పష్టత రాలేదు. రైలు పట్టాలు తప్పిన సమయం.. ట్రాక్లో పట్టాలు రెండువైపులా విరిగి ఉండటాన్ని పరిశీలిస్తే.. సాంకేతిక కారణాలూ ఉండొచ్చన్న అనుమానాల్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
విద్రోహ చర్య.. ప్రమాదానికి ముందు పేలుడు తరహా శబ్దం
నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో విద్రోహచర్యను తోసిపుచ్చలేమని ఢిల్లీ రైల్వే వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే ట్రాక్పై రెండు గంటల ముందే ఒక గూడ్స్ రైలు సురక్షితంగా ప్రయాణించిందని, ట్రాక్ తనిఖీ కూడా జరిగిందని, ప్రమాదం జరగడానికి కొద్దిసేపు ముందు బాణాసంచా తరహా పేలుడు శబ్దాన్ని హిరాఖండ్ రైలు డ్రైవర్ విన్నాడని, పట్టా విరిగిపోయి ఉండటంతో ప్రమాదం సంభవించిందని, ఏది ఏమైనా రైల్వే భద్రతా కమిషనర్ విచారణలో అసలు కారణం వెల్లడవుతుందని అంటున్నారు.
వేగం తట్టుకోలేక విరిగిందా?
మరోవైపు బాంబులు పెట్టి పేల్చితే పట్టాలు వంగిపోవడం, కింద గొయ్య ఏర్పడటం వంటివి జరుగుతాయని, విరిగే అవకాశాలు ఉండవని కూడా అంటున్నారు. ప్రమాదం జరిగిన సమయం రాత్రి 12 గంటలలోపే. అది కూడా స్టేషన్కు తూర్పు క్యాబిన్ దగ్గరే ఉండటంతో ఎవరైనా వస్తే కదలికలు తెలిసే అవకాశం ఉంటుందంటున్నారు. పట్టాలను నిశితంగా పరిశీలించినట్లయితే కొంతమేర తుప్పు పట్టినట్లుగా కనిపిస్తోందని, బలహీనంగా మారిన ట్రాక్... వేగంగా వెళుతున్న రైలు బరువును తట్టుకోలేక విరిగిందా? అన్న సందేహాలూ వ్యక్తం అవుతున్నాయి.