జగన్ దీక్షకు 'నారాయణ' బస్సు: అతివేగంతో ఢీకొని ఐదుగురి మృతి
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రయివేటు బస్సు జనం పైకి దూసుకు వెళ్లింది. రాజమండ్రి - మోరంపూడి జంక్షన్ వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతి చెందారు. ఆ బస్సు కారు, బస్సులను ఢీకొట్టి, జనం పైకి దూసుకు వెళ్లింది.
ఈ ప్రమాదం సంఘటన స్థానికంగా ఉన్న ఓ సీసీ కెమెరాలో లభ్యమైంది. సిగ్నల్ పడినప్పటికీ బస్సు డ్రైవర్ వేగంగా వెళ్లినట్లుగా కెమెరాలో నిక్షిప్తమై ఉంది. ఈ బస్సు నారాయణ పాఠశాలకు చెందినదిగా తెలుస్తోంది.
డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని, బస్సుకు బ్రేకులు ఫెయిల్ కావడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఆ బస్సు మొదట కారును గుద్దుకుంది. కారులో వెళ్తున్న వారికి స్వల్పంగా గాయాలయ్యాయి. అనంతరం బస్సు రెండు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం జనం పైకి దూసుకు వెళ్లింది. పలువురికి గాయాలయ్యాయి. దీంతో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ బస్సును వైసీపీ బుక్ చేసినట్లుగా చెబుతున్నారు
ఈ బస్సును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్ దీక్ష కోసం బుక్ చేసుకున్నట్లుగా చెబుతున్నారు. మరోవైపు ఇది నారాయణ పాఠశాలకు చెందినదని అంటున్నారు. దీనిని వైసీపీ బుక్ చేసుకుంది. ఈ సమయంలో దుర్ఘటన జరిగింది.