నంద్యాలలో ఏరులై పారుతున్న, మద్యం డబ్బు: 43మంది అరెస్ట్, భారీ మొత్తం సీజ్
కర్నూలు: అధికార, ప్రతిపక్ష పార్టీలు నంద్యాల ఉప ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సాధారణ ఎన్నికలు మరో రెండేళ్లలో జరుగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో గెలుపు కోసం రెండు పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. దీంతో నియోజకవర్గంలో మద్యం, నగదు ఏరులై పారుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఓటర్లను డబ్బుతో కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నంద్యాలలో ఓటర్లకు డబ్బులు పంచుతున్న 22 మందిని కర్నూలు ఒకటో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గాంధీనగర్, ఐలూరు ప్రాంతాల్లో నగదు పంపిణీ చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా 22 మంది దొరికారు. వారి నుంచి భారీస్థాయిలో నగదును స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. పోలీసులకు పట్టుబడిన వారిలో 9మంది కడప, ఆరుగురు పులివెందుల, మిగిలిన వారు నెల్లూరు ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వీరు ఏ పార్టీకి చెందినవారన్న దాని ఆరా తీస్తున్నారు.
'ఏడ్చుకుంటూ వెళ్లు': రోజా, జగన్లపై వేణుమాధవ్ సెటైర్లు, వారించిన టీజీ
నగదు పంపిణీ విషయంలో నేతల మధ్య తలెత్తిన వివాదం కారణంగానే ఈ విషయం బయటకు పొక్కినట్లు తెలుస్తోంది. మరోవైపు ఓ ప్రాంతంలో ఓటుకు రూ.2వేలు ఇస్తుండగా.. మరొకచోట తక్కువ ఇస్తున్నారని స్థానికులు వారితో గొడవ పెట్టుకున్నారని.. అందుకే ఎవరో ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేసి ఉంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
కాగా, నంద్యాల వ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో మరో 21మంది పట్టుబడ్డారు. మద్యం, డబ్బులను వారి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.12లక్షలకు పైగా డబ్బును పోలీసులు సీజ్ చేశారు. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు పోటీ చేస్తున్న అన్ని పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. భారీ మొత్తంలో డబ్బు పంచేందుకు కూడా వారు వెనుకాడటం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే.. నంద్యాలలో పార్టీల గెలుపు, ఓటములపై భారీ స్థాయిలో బెట్టింగులు జరుగుతుండటం గమనార్హం.